భారత్కు రానున్న టొయోటా ఆర్ఏవి4 ఎస్యూవీ - వివరాలు
జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా అంతర్జాతీయ మార్కెట్లలో విక్రయిస్తున్న పాపులర్ ఎస్యూవీ ఆర్ఏవి4 (RAV4)ను వచ్చే ఏడాది భారత మార్కెట్లో విడుదల చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఆటోకార్ ఇండియా ప్రకారం, టొయోటా కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (సియుబి) రూట్లో పూర్తిగా తయారైన టొయోటా ఆర్ఏవి4 ఎస్యూవీని భారత్కు దిగుమతి చేసుకోనుంది.

టొయోటా ఆర్ఏవి4ను భారత్కు తీసుకురావడానికి టొయోటా కొత్త భారత దిగుమతి నియమాలను ఉపయోగించుకోనుంది. సరికొత్త భారత దిగుమతి నియమాల ప్రకారం, ఆటోమొబైల్ కంపెనీలు సంవత్సరానికి సికెడి మరియు సిబియు ఛానల్స్ ద్వారా 2,500 వాహనాలను దిగుమతి చేసుకోవచ్చు. అయితే, దేశంలోకి దిగుమతి చేసుకునే అన్ని వాహనాలు కూడా అంతర్జాతీయ ఆటోమోటివ్ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి.

విదేశాల నుంచి పరిమిత సంఖ్యలో దిగుమతి చేసుకున్న యూనిట్లపై సడలింపులు ఉన్నప్పటికీ, సిబియులుగా వచ్చే వాహనాలకు సుంకాలు పెరిగినందున, వీటి ధర సికెడి వాహనాల కన్నా ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా, టొయోటా ఆర్ఏవి4 భారత మార్కెట్లో విడుదలైనప్పుడు ఇది ఫార్చ్యూనర్ ఎస్యూవీకి ఎగువన ఉండవచ్చని సమాచారం.

టొయోటా ఆర్ఏవి4 4600 మిమీ పొడవు, 1855 మిమీ వెడల్పు మరియు 1685 మిమీ ఎత్తును కలిగి ఉంటుంది. ఇది 2690 మిమీ వీల్బేస్ను కలిగి ఉంటుంది. మిడ్ సైజ్ ఎస్యూవీ విభాగంలో టొయోటా తమ సరికొత్త ఆర్ఏవి4ను ప్రవేశపెట్టే ఆస్కారం ఉంది. ఇది ఈ సెగ్మెంట్లో ఎమ్జి హెక్టర్ మరియు టాటా హారియర్ మోడళ్ల మాదిరిగా ఉంటుంది. అయితే, ధర పరంగా ఇది వాటి కన్నా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

టొయోటా ఆర్ఏవి4 ఎస్యూవీలో క్రోమ్ గ్రిల్, ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్లతో కూడిన ఎల్ఈడి హెడ్ల్యాంప్లు, ఎల్ఈడి టైల్ల్యాంప్లు, ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్లు, రెండు చివర్లలో స్కఫ్ ప్లేట్లు మరియు డ్యూయెల్ క్రోమ్ ఎగ్జాస్ట్ టిప్స్ ఇది అగ్రెసివ్గా కనిపించే ఫ్రంట్ ఫాసియాను కలిగి ఉంటుంది. ఇంకా ఇందులో వేరియంట్ను బట్టి 17 ఇంచ్ మరియు 19 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఆఫర్ చేయటం జరుగుతుంది.

ఇంటీరియర్స్లో ఎనిమిది అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ను కలిగి ఉంది, ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే మరియు బ్రాండ్ యొక్క తాజా కనెక్ట్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుంది. ఇంకా ఇందులో డిజిటల్ రియర్-వ్యూ మిర్రర్, జెబిఎల్ ప్రీమియం ఆడియో సిస్టమ్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్, సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు ఎలక్ట్రికల్లీ ఆపరేటెడ్ పానోరమిక్ సన్రూఫ్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది.

టొయోటా ఆర్ఏవి4 ఎస్యూవీలో ఆప్షనల్ హైబ్రిడ్ టెక్నాలజీతో కూడిన 2.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ కూడా ఉంటుంది. భారత మార్కెట్లోకి కంపెనీ తమ హైబ్రిడ్-పెట్రోల్ ఇంజన్ను తీసుకువస్తుందని అంచనా. ఈ 2.5-లీటర్ డిఓహెచ్సి ఇంజన్ ఎలక్ట్రిక్ మోటారుతో జతచేయబడి ఉంటుంది. ఇది లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్తో పనిచేస్తుంది.

హైబ్రిడ్-పెట్రోల్ ఇంజన్లు రెండూ కలిసి 221 బిహెచ్పిల శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ఈ పవర్ సివిటి ఆటోమేటిక్ గేర్బాక్స్ ద్వారా నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ అవుతుంది. ఇది మొత్తంగా 40 ఎమ్పిజి మైలేజీని ఇస్తుంది. అంటే మన దేశంలో సుమారు లీటరుకు 17 కి.మీ మైలేజీని ఆఫర్ చేస్తుంది.

టొయోటా ఆర్ఏవి4 ఎస్యూవీపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
టొయోటా ఆర్ఏవి4 ఎస్యూవీ 2021 మధ్యలో భారత మార్కెట్లో విడుదలయ్యే అవకాశం ఉంది. హైబ్రిడ్ టెక్నాలజీతో వచ్చే ఈ మోడల్ ధర రూ.60 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండొచ్చని అంచనా. దేశంలో ఇది పరిమిత సంఖ్యలో మాత్రమే లభ్యం కానుంది.


Click it and Unblock the Notifications








