కొత్త 3 సిరీస్ ఎమ్ పెర్ఫార్మెన్స్ వేరియంట్ను విడుదల చేయనున్న బిఎమ్డబ్ల్యూ
జర్మన్ లగ్జరీ కార్ బ్రాండ్ బిఎమ్డబ్ల్యూ, భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ 3 సిరీస్లో కొత్తగా ఎమ్ పెర్ఫార్మెన్స్ మోడల్ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. కొత్త బిఎమ్డబ్ల్యూ ఎమ్340ఐ వేరియంట్ను కంపెనీ మార్చ్ 10, 2021 వ తేదీన భారతదేశంలో విడుదల చేయనుంది.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఇది భారతదేశంలో అసెంబుల్ కానున్న మొట్టమొదటి బిఎమ్డబ్ల్యూ పెర్ఫార్మెన్స్ కారు కానుంది. బిఎమ్డబ్ల్యూ ఇప్పటి వరకూ తమ ఎమ్ స్పెక్ పెర్ఫార్మెన్స్ కార్లను విదేశాల నుండి దిగుమతి చేసుకునేది. కాగా, ఈ కొత్త ఎమ్340ఐ మోడల్ను ఇక్కడే స్థానికంగా అసెంబలు చేయనుంది.

కొత్త బిఎమ్డబ్ల్యూ ఎమ్340ఐ మోడల్ బ్రాండ్ యొక్క సిగ్నేచర్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్తో లభ్యం కానుంది. ఈ కారులో ఆఫర్ చేయబోయే కొన్ని ముఖ్యమైన ఫీచర్ల విషయానికి వస్తే, ఇందులో 10.25 ఇంచ్ టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, సరికొత్త బిఎమ్డబ్ల్యూ ఐ-డ్రైవ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.

అంతేకాకుండా, ఇందులో జెస్చర్ కంట్రోల్, ఎల్ఈడి హెడ్లైట్, ఎల్ఈడి టెయిల్ లైట్, త్రీ జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, క్రూయిజ్ కంట్రోల్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైన ఫీచర్లు కూడా ఉండనున్నాయి.

ఇక ఇంజన్ విషయానికి వస్తే, ఇందులో 3.0-లీటర్ ఇన్-లైన్, 6-సిలిండర్ ట్విన్ టర్బో పెట్రోల్ ఇంజన్ను ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 374 బిహెచ్పి పవర్ను మరియు 500 న్యూటన్ మీటర్ల టార్క్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్బాక్స్ ద్వారా ఇంజన్ శక్తిని నాలుగు చక్రాలకు సమానంగా పంపిణీ చేస్తుంది.

బిఎమ్డబ్ల్యూ ఇప్పటికే తమ ఎమ్ పెర్ఫార్మెన్స్ మోడళ్లలో కొన్నింటిని భారత మార్కెట్లో విక్రయిస్తోంది. వీటిలో జి4 ఎమ్40i రోడ్స్టర్, ఎక్స్7 ఎమ్50డి ఎస్యూవీ మరియు ఎమ్760ఎల్ సెడాన్ మోడళ్లు ఉన్నాయి.

భారత లగ్జరీ కార్ మార్కెట్పై పట్టు సాధించే బిఎమ్డబ్ల్యూ, ఈ ఏడాది భారత మార్కెట్లో 25 కొత్త కార్లను విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. గతేడాది కరోనా మహమ్మారి కారణంగా, భారత మార్కెట్లో విడుదల చేయాలనుకున్న కొన్ని మోడళ్లను కంపెనీ ఈ ఏడాదికి వాయిదా వేసుకుంది.

కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, బిఎమ్డబ్ల్యూ భారత మార్కెట్ కోసం ప్లాన్ చేసిన 25 కొత్త మోడళ్లలో 8 పూర్తిగా సరికొత్త మోడళ్లు కాగా 9 ఫేస్లిఫ్ట్ మోడళ్లు మరియు 8 కొత్త కార్ వేరియంట్లు రానున్నాయి.

బిఎమ్డబ్ల్యూ ఇండియాకు సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, కంపెనీ తాజాగా భారత మార్కెట్లో తమ సరికొత్త 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ మోడల్ను విడుదల చేసింది. మార్కెట్లో ఈ లగ్జరీ లిమోసిన్ కారు ప్రారంభ ధర రూ.51.5 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

ఈ కొత్త బిఎమ్డబ్ల్యూ లిమోసిన్ వేరియంట్ను ప్రస్తుత 3 సిరీస్ మోడల్ను ఆధారంగా చేసుకొని, లాంగ్-వీల్బేస్ వేరియంట్గా తయారు చేశారు. గడచిన జనవరి నెల నుండే ఈ కొత్త 3 సిరీస్ గ్రాన్ లిమోసిన్ కోసం బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి.


Click it and Unblock the Notifications








