ఇక బ్యాటరీ చార్జింగ్ సమస్యే ఉండదు; కొత్తగా 500, రెండేళ్లలో 10,000 చార్జింగ్ స్టేషన్లు
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఇఇఎస్ఎల్ (ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్) కృషి చేస్తోంది. ఇందులో భాగంగానే, దేశంలో కొత్తగా 500 ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తోంది.

విద్యుత్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని పిఎస్యుల జాయింట్ వెంచర్ అయిన ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఇఇఎస్ఎల్) భారతదేశంలో ఇ-మొబిలిటీ పర్యావరణ వ్యవస్థను పెంచే ప్రాజెక్టును చేపట్టింది. ఇందులో భాగంగానే 2020-21 ఆర్థిక సంవత్సరంలో దేశంలో కనీసం 500 ఎలక్ట్రిక్ వెహికల్ (ఇవి) ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది.

ఈ విషయం గురించి ఇఇఎస్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ రజత్ సుద్ మాట్లాడుతూ.. గత సంవత్సరం దేశంలోకి ప్రవేశించిన కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక సంవత్సరం చాలా కష్టంగా ప్రారభమైందని, అయినప్పటికీ తాము భారతదేశంలో ఇప్పటికే 207 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశామని అన్నారు.

గత ఏడాది మే నెల చివరి వరకు కొనసాగిన లాక్డౌన్ కారణంగా ఇఇఎస్ఎల్ సరఫరా గొలుసు (సప్లయ్ చైన్) దెబ్బ తినడంతో చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు అంతరాయం కలిగిందని ఆయన చెప్పారు. కాగా, ఇప్పుడు తయారీదారుల నుండి సరఫరా తిరిగి ప్రారంభం కావడంతో, రవాణా సదుపాయాలు పునరుద్ధరించడంతో ఈ ఆర్థిక సంవత్సరం చివరినాటికి కనీసం 500 ఛార్జింగ్ స్టేషన్లను వ్యవస్థాపించే దిశగా ఇఇఎస్ఎల్ ముందుకు సాగుతోందని రజత్ సుద్ చెప్పారు.

రాబోయే రెండు, మూడు సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా 10,000 ఛార్జింగ్ స్టేషన్ల నెట్వర్క్ను ఏర్పాటు చేయాలని ఇఇఎస్ఎల్ యోచిస్తోంది. ఈ నెట్వర్క్ సాయంతో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం గణనీయంగా పెరిగి, కాలుష్యం తగ్గుతుందని కంపెనీ భావిస్తోంది.

ఇందుకు సంబంధించి ఇఇఎస్ఎల్ ఇప్పటికే అదనంగా 1020 ఛార్జర్ల సేకరణను కూడా పూర్తి చేసింది. అంతేకాకుండా, సోలార్ రూఫ్, బ్యాటరీ ఆధారిత ఛార్జింగ్ స్టేషన్లు మరియు బ్యాటరీ మార్పిడి స్టేషన్లను కలుపుతూ 'కార్బన్ న్యూట్రల్ ఛార్జింగ్ స్టేషన్లు' కూడా ఏర్పాటు చేయాలని ఇఇఎస్ఎల్ ప్లాన్ చేస్తోంది.

పెట్రోల్, డీజిల్ వాహనాల ఇంధన అవసరాలను తీర్చడానికి భారత్ విదేశాల నుండి ముడి చమురును ఎక్కువగా దిగుమతి చేసుకుంటోంది. దీనిని తగ్గించడానికి మరియు పెట్రోల్, డీజిల్ వాహనాల వల్ల కలిగే వాయు కాలుష్య సమస్యకు చెక్ పెట్టేందుకు ఎలక్ట్రిక్ వాహనాలు అద్భుతమైన ప్రత్యామ్నాయంగా ఉంటాయి.

అయితే, దేశంలో పెట్రోల్ పంపుల మాదిరిగా ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ స్టేషన్లు లేకపోవటంతో చాలా మంది కొనుగోలుదారులు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై ఆసక్తికనబరచం లేదు. ఎలక్ట్రిక్ వాహనాలను కొనాలనే కోరిక ఉన్నప్పటికీ, ఛార్జింగ్ స్టేషన్లు లేకపోవడంతో చాలా మంది తిరిగి పెట్రోల్, డీజిల్ వాహనాల వైపే మొగ్గు చూపుతున్నారు.

ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇఇఎస్ఎల్, దేశంలో ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్యను గణనీయంగా పెంచేందుకు కసరత్తులు చేస్తోంది. ప్రభుత్వ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయడానికి అపోలో హాస్పిటల్స్, బిఎస్ఎన్ఎల్, మహా-మెట్రో, భెల్ మరియు హెచ్పిసిఎల్ వంటి వివిధ ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగ సంస్థలతో ఇఇఎస్ఎల్ ఒప్పందాలను కుదుర్చుకుంది.

హైదరాబాద్, నోయిడా, అహ్మదాబాద్, జైపూర్ మరియు చెన్నై వంటి నగరాల్లోని స్థానిక సంస్థలతో ఇఇఎస్ఎల్ భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. ఆయా నగరాల్లో బ్యాటరీ చార్జింగ్ మౌలిక సదుపాయాలను రూపొందించడానికి ఇతర సంస్థలతో కూడా కంపెనీ చర్చలు జరుపుతోంది.


Click it and Unblock the Notifications








