ఎట్టకేలకు భారత్లో అడుగుపెట్టిన జాగ్వార్ ఐ-పేస్ : ధర, ఫీచర్లు & వివరాలు
భారత మార్కెట్లో ఎంతోకాలంగా చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్న జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్-ఎస్యూవీ ఎట్టకేలకు విడుదలైంది. ఈ ఐ-పేస్ దేశంలో జాగ్వార్ యొక్క మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ సమర్పణ. జాగ్వార్ ఐ-పేస్ ప్రారంభ ధర దేశీయ మార్కెట్లో రూ. 1.05 కోట్లు (ఎక్స్-షోరూమ్ (ఇండియా).

జాగ్వార్ తన ఐ-పేస్ ఎస్యూవీని ఎస్, ఎస్ఇ, మరియు హెచ్ఎస్ఇ అనే మూడు వేరియంట్లలో అందిస్తుంది. ఇందులో ఉన్న మిడ్-స్పెక్ వేరియంట్ ధర రూ. 1.88 కోట్లు కాగా, టాప్-స్పెక్ ఐ-పేస్ వేరియంట్ ధర రూ. 1.12 కోట్లు.
| Jaguar I-PACE | Ex-Showroom Price |
| S | ₹105.91 Lakh |
| SE | ₹108.15 Lakh |
| HSE | ₹112.29 Lakh |

ఈ ఎస్యూవీ భారతదేశంలో ప్రారంభించటానికి ముందే ప్రీ-లాంచ్ బుకింగ్లను కంపెనీ స్వీకరించడం ప్రారంభించింది. కావున జాగ్వార్ ఐ-పేస్ డెలివరీలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. భారతదేశంలో ఐ-పేస్ కస్టమర్లకు కంపెనీ ఆఫీస్ మరియు హోమ్ ఛార్జింగ్ సౌకర్యాలను కూడా అందించనుంది.

ఇది మాత్రమే కాకుండా వినియోగదారులు టాటా పవర్ ఏర్పాటు చేసిన దేశవ్యాప్తంగా 200 పైగా ఛార్జింగ్ పాయింట్లను 'ఈజడ్ ఛార్జ్' ఛార్జింగ్ నెట్వర్క్ కింద యాక్సెస్ చేయవచ్చు. ఈ ఎస్యూవీని 7.4 కిలోవాట్ల ఎసి వాల్-మౌంట్ ఛార్జర్ను స్టాండర్డ్గా అందించనున్నారు.

ఐ-పేస్ ఎస్యూవీ యొక్క బ్యాటరీ ప్యాక్పై ఎనిమిదేళ్ల వారంటీ లేదా 1,60,000 కిలోమీటర్ల వారంటీ, ఐదేళ్ల సర్వీస్ ప్యాకేజీ మరియు (ఆర్ఎస్ఏ) రోడ్-సైడ్ అసిస్టెన్స్ వంటివాటిని కూడా కంపెనీ వినియోగదారులకు అందించనుంది.
జాగ్వార్ ఐ-పేస్ లో 90 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది గరిష్టంగా 395 బిహెచ్పి పవర్ మరియు 696 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఆల్-వీల్-డ్రైవ్ సిస్టమ్ ద్వారా నాలుగు చక్రాలకు శక్తిని పంపుతుంది. ఇది ఒకసారి ఫుల్ ఛార్జ్ చేసుకున్న తర్వాత దాదాపు 470 కిలోమీటర్ల డ్రైవింగ్ పరిధిని ఇస్తుంది.

జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కేవలం 4.8 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. ఈ ఎస్యూవీ యొక్క గరిష్ట వేగం గంటకు 200 కిలోమీటర్లు. ఎలక్ట్రిక్ ఎస్యూవీలో యాక్టివ్ ఎలక్ట్రానిక్ ఎయిర్ సస్పెన్షన్తో పాటు మల్టిపుల్ డ్రైవ్ మోడ్లు ఉంటాయి. ఇది మంచి సస్పెన్షన్ సెటప్ కలిగి ఉంటుంది, అంతే కాకుండా బ్రేకింగ్ సిస్టం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది.

ఐ-పేస్లో ఇంటిగ్రేటెడ్ డిఆర్ఎల్లు, ఎల్ఇడి టైల్ లాంప్స్, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్, బ్రాండ్ సిగ్నేచర్ హనీకూంబ్ గ్రిల్తో ఎల్ఇడి హెడ్ల్యాంప్లు ఉన్నాయి. వీటితోపాటు 19 ఇంచెస్ 5 స్పోక్ అల్లాయ్ వీల్స్ కూడా ఉన్నాయి.

జాగ్వార్ ఐ-పేస్ ఎలక్ట్రిక్-ఎస్యూవీ యొక్క ఇంటీరియర్స్ విషయానికి వస్తే, ఇందులో లెదర్ తో చుట్టబడిన సీట్లు ఉన్నాయి. ఇవి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తాయి. ఈ ఎస్యూవీలో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు క్లైమేట్ కంట్రోల్ యూనిట్ కోసం రిజర్వు చేయబడిన మూడు డిస్ప్లేలు ఉన్నాయి. ఇన్ఫోటైన్మెంట్ సమీపంలోని ఛార్జింగ్ స్టేషన్లను చూపించగల మెరుగైన EV నావిగేషన్తో బ్రాండ్ యొక్క పివి ప్రో టెక్నాలజీని కలిగి ఉంది.

డ్యూయల్-జోన్ క్లైమేట్ కంట్రోల్, ఫిక్స్డ్ పనోరమిక్ సన్రూఫ్, యాంబియంట్ లైటింగ్, ఎయిర్ క్వాలిటీ సెన్సార్, 8 వే పవర్ తో కూడిన ఫ్రంట్ సీట్లు, మెరిడియన్ నుండి ప్రీమియం ఆడియో సిస్టమ్, వాయిస్ అసిస్ట్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే ద్వారా వైర్లెస్ స్మార్ట్ఫోన్ కనెక్టివిటీ వంటి ఫీచర్లు ఉన్నాయి.

జాగ్వార్ ఐ-పేస్లోని సేఫ్టీ ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో 6 ఎయిర్బ్యాగులు, ఎమర్జెన్సీ బ్రేక్ అసిస్ట్, ఫ్రంట్ అండ్ రియర్ పార్కింగ్ ఎయిడ్, 360 డిగ్రీస్ 3 డి సరౌండ్ కెమెరా, డ్రైవర్ కండిషన్ మానిటర్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ వంటివి ఉన్నాయి.

భారతమార్కెట్లో విడుదలైన జాగ్వార్ ఐ-పేస్, మెర్సిడెస్ బెంజ్ ఇక్యూసి, రాబోయే ఆడి ఇ-ట్రోన్ మరియు వోల్వో ఎక్స్సి 40 రీఛార్జ్ వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది. దేశీయ మార్కెట్లో రోజురోజుకి ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది, ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు జాగ్వార్ కంపెనీ తన ఐ-పేస్ లాంచ్ చేసింది.


Click it and Unblock the Notifications








