రెండవసారి ధరల పెంపుకు సిద్ధమైన మారుతి సుజుకి, ఏప్రిల్ నుండి అమలు!
భారతదేశంలో ఆటోమొబైల్ కంపెనీలు తమ వాహనాల ధరలను పెంచి సరిగ్గా రెండు నెలలు కూడా గడవక ముందే మరోసారి ధరలను పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది జనవరి నెలలో ధరలను పెంచిన కంపెనీలు ఇప్పుడు ఏప్రిల్ నెల నుండి తమ వాహనాల ధరలను పెంచనున్నాయి.

దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా వచ్చే ఏప్రిల్ 2021 నెల నుండి తమ కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇన్పుట్ ఖర్చులు పెరగడం వలన ఉత్పాదక వ్యయం పెరిగిందని, ఫలితంగా ధరలను పెంచడం తప్ప వేరే మార్గం లేదని కంపెనీ పేర్కొంది.

మారుతి సుజుకి ఇండియా గడచి జనవరి నెలలో కూడా తమ కార్ల ధరలను పెంచింది. ఆ సమయంలో కంపెనీ ఎంపిక చేసిన మోడళ్ల ధరలను రూ.5000 నుండి రూ.34,000 మేర పెంచింది. అయితే, ఏప్రిల్ 2021 నుండి కార్ల ధరలను ఎంత మేర పెంచనున్న విషయాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

భారతదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా గతేడాది ఇదే సమయంలో దేశవ్యాప్త లాక్డౌన్ను ప్రకటించిన విషయం తెలిసినదే. దాదాపు మూడు నెలల పాటు సాగిన లాక్డౌన్ కారణంగా, దేశీయ కార్ కంపెనీలు నష్టాల బాట పట్టాయి. ఆ నష్టాలను పూడ్చుకునేందుకు కంపెనీలు గత జనవరి 2021లో తమ వాహనాలను ధరలను భారీగానే పెంచాయి.

అంతేకాకుండా, ఈ సమయంలో కంపెనీలు ప్రవేశపెట్టిన రిఫ్రెష్డ్ మోడళ్లను కూడా అధిక ధరలతోనే విడుదల చేశారు. ఇలా వాహనాల ధరలను పెంచి సరిగ్గా రెండు నెలల సమయం కూడా గడవక మునుపే కంపెనీలు మరో పెంపుకి సిద్ధం కావటం గమనార్హం. మారుతి సుజుకి గతంలో ధరల పెంపుకు కూడా పెరుగుతున్న ఇన్పుట్ ధరలనే సాకుగా చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉంటే, మారుతి సుజుకి ఇండియా ప్రస్తుత నెలలో (మార్చి 2021లో) తమ కార్లపై డిస్కౌంట్లు మరియు వివిధ రకాల ప్రయోజనాలను కూడా అందిస్తోంది. అరేనా డీలర్షిప్లు 20,000 నగదు ప్రయోజనాన్ని మరియు సెలెరియో, ఎస్-ప్రెస్సోపై మోడళ్లపై రూ .20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ను ఆఫర్ చేస్తున్నాయి.

అలాగే, ఈకో, స్విఫ్ట్ మరియు విటారా బ్రెజ్జా మోడళ్లపై రూ.30,000 వరకు ప్రయోజనాలను అందిస్తున్నారు. కంపెనీ యొక్క ఎంట్రీ లెవల్ కార్ మారుతి ఆల్టో 800పై రూ.15,000 విలువైన ప్రయోజనాలను ఆఫర్ చేస్తున్నారు. వ్యాగన్ఆర్పై రూ.23,000 మరియు డిజైర్పై రూ.28,000 విలువైన ప్రయోజనాలు అందిస్తున్నారు.

మారుతి సుజుకి నెక్సా ప్రీమియం డీలర్షిప్లు విక్రయిస్తున్న ఎస్-క్రాస్పై రూ.67,000 డిస్కౌంట్ ఇస్తుండగా, ఇగ్నిస్పై రూ.39,000 విలువైన ప్రయోజనాలను మరియు బాలెనోపై రూ.29,000 డిస్కౌంట్ను అందిస్తున్నారు.

మారుతి సుజుకి ప్రీమియం సెడాన్ సియాజ్పై రూ.40,000 వరకూ ప్రయోజనాలను అందిస్తున్నారు. ఈ ఆఫర్లకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం మీ సమీపంలోని డీలర్షిప్ కేంద్రాలను సందర్శించండి.


Click it and Unblock the Notifications








