కోవిడ్-19 ఎఫెక్ట్: వారం రోజుల పాటు ఎమ్జి మోటార్స్ ప్లాంట్ మూసివేత!
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. కోవిడ్-19 సెకండ్ వేవ్ మునుపటి కంటే వేగంగా, విస్తరిస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తోంది. ఈ నేపథ్యంలో, దేశంలోని అనేక ప్రాంతాల్లో స్వచ్ఛందంగా లాక్డౌన్ విధిస్తున్నారు.

ఈ నేపథ్యంలో, చైనీస్ కార్ బ్రాండ్ ఎమ్జి మోటార్ ఇండియా, గుజరాత్లోని తమ హలోల్ ప్లాంట్లో ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 29 నుండి మే 5 వరకు ఈ ప్లాంట్ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది.

దేశంలో 'కోవిడ్ గొలుసును విచ్ఛిన్నం చేసే' ప్రయత్నంలో భాగంగా, తమ ప్లాంట్లో ఉత్పత్తికి తాత్కాలికంగా బ్రేక్ ఇస్తున్నామని ఎమ్జి మోటార్ ఇండియా ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ చాబా ధృవీకరించారు.

సోషల్ మీడియా వేదికగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. కోవిడ్ గొలుసును విచ్ఛిన్నం చేయడానికి వడోదరలోని హలోల్ ప్లాంట్ను 7 రోజుల పాటు మూసివేయాలని తాము నిర్ణయించుకున్నామని, తమ ఉద్యోగులు ఈ కఠినమైన సమయాల్లో సురక్షితంగా ఉండటానికి మరియు సమాజాన్ని జాగ్రత్తగా చూసుకోవడానికి కట్టుబడి ఉన్నారని ఆయన తన ట్వీట్లో తెలిపారు.

ప్రస్తుతం గుజరాత్ కోవిడ్-19 కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఎమ్జి మోటార్ ఇండియా తమ ఉద్యోగులు మరియు సమాజం పట్ల జాగ్రత్త వహించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం వలన ఉత్పత్తికి అంతరాయం ఏర్పడి, వాహనాల వెయిటింగ్ పీరియడ్ మరింత పెరిగే అవకాశం ఉంది.

గడచిన మార్చి 2021 నెలలో కంపెనీ తమ వాహనాల వెయిటింగ్ పీరియడ్కు సంబంధించి ఓ ప్రకటన చేసిన సంగతి తెలిసినదే. భారత మార్కెట్లో తాము విక్రయిస్తున్న కార్లకు ఏర్పడుతున్న భారీ డిమాండ్ కారణంగా, వాటి వెయిటింగ్ పీరియడ్ కూడా భారీగా పెరిగిపోతోంది.

ప్రస్తుతం కొత్తగా తమ కార్లు కొనుగోలు చేసే కస్టమర్లు, వాటి డెలివరీ కోసం సుమారు 2-3 నెలలు వేచి ఉండాల్సి వస్తోందని కంపెనీ పేర్కొంది. ఎమ్జి మోటార్ ఇండియా ప్రస్తుతం దేశీయ మార్కెట్లో హెక్టర్, హెక్టర్ ప్లస్, గ్లోస్టర్ మరియు ఎమ్జి జెడ్ఎస్ ఈవీ అనే నాలుగు ఎస్యూవీలను విక్రయిస్తోంది.

గుజరాత్లో ఉన్న హలోల్ ప్లాంట్లో ఎమ్జి మోటార్ ఈ నాలుగు మోడళ్లను తయారు చేస్తోంది. ప్రస్తుతం ఈ ప్లాంట్ ఏటా 80,000 వాహనాలను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంది. గతంలో అమెరికన్ కార్ బ్రాండ్ జనరల్ మోటార్స్ ఈ ప్లాంట్ను ఆపరేట్ చేసేది. జనరల్ మోటార్స్ నుండి ఎమ్జి మోటార్ ఈ ప్లాంట్ను కొనుగోలు చేసింది.

ఇదిలా ఉంటే, ప్రస్తుత సంక్షోభ సమయంలో ప్రజలకు సహాయం చేయడం కోసం ఈ కంపెనీ ముందుకొచ్చింది. ఇందులో భాగంగా, మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచడానికి ఎమ్జి మోటార్ కంపెనీ మోక్సీకి చెందిన దేవానందన్ గ్యాసెస్తో చేతులు కలిపింది. వడోదరలోని ప్రధాన వైద్య ఆక్సిజన్ ఉత్పత్తిదారులలో దేవానందన్ గ్యాసెస్ కూడా ఒకటి.


Click it and Unblock the Notifications








