కొత్త 2021 స్కార్పియో లాంచ్ మరింత ఆలస్యం కానుందా? కారణం అదేనా?
మహీంద్రా అభిమానులకు ఇది నిరాశపరచే వార్తనే చెప్పాలి. వాస్తవానికి గతేడాదే మార్కెట్లో విడుదల కావల్సిన కొత్త తరం మహీంద్రా స్కార్పియో మరియు కొత్త తరం మహీంద్రా ఎక్స్యూవీ500 మోడళ్లు కరోనా కారణంగా ఈ ఏడాదికి వాయిదా పడిన సంగతి తెలిసినదే.

అయితే, ఈ ఏడాదిలో ఇవి అంత త్వరగా మార్కెట్లోకి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఇందుకు ప్రధాన కారణం, సెమీకండక్టర్ చిప్స్ కొరతగా తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆటోమొబైల్ పరిశ్రమ ప్రస్తుతం ఈ సెమీకండక్టర్ చిప్స్ కొరతను ఎదుర్కుంటోంది.

మహీంద్రా తమ కొత్త తరం ఎక్స్యూవీ500 మరియు స్కార్పియో మోడళ్లపై గత కొంత కాలంగా పనిచేస్తోంది. ఇవి పూర్తిగా సరికొత్త డిజైన్ మరియు లేటెస్ట్ టెక్నాలజీ ఫీచర్లతో అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది ద్వితీయార్థం నాటికి కంపెనీ వీటికి మార్కెట్లోకి ప్రవేశపెట్టాలని భావించింది.

అయితే, ప్రస్తుత పరిస్థితులను గమనిస్తుంటే వీటి విడుదలలో మరింత జాప్యం ఎదురయ్యేట్లుగా తెలుస్తోంది. మోడ్రన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఈసియూ (ఇంజన్ కంట్రోల్ యూనిట్), డ్రైవర్ అసిస్టెడ్ ఫీచర్స్ మరియు ఇతర ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్లో ఈ సెమీకండక్టర్ చిప్లను ఉపయోగిస్తారు.

సెమీకండక్టర్ చిప్స్ లేకుండా, కారు తయారీలో అవసరమైన ఇలాంటి ముఖ్యమైన భాగాలను తయారు చేయలేరు మరియు వాటిని అమర్చలేరు. ఫలితంగా, కార్ల ఉత్పత్తి కూడా అసాధ్యంగా మారుతుంది. ఈ సమస్య వలన మహీంద్రా తమ వాహనాల ఉత్పత్తిలో తీవ్ర అంతరాయాన్ని ఎదుర్కుంటోంది.

కంపెనీ ఇప్పటికే విక్రయిస్తున్న కొత్త తరం థార్లో కూడా మహీంద్రా ఈ సమస్యను ఎదుర్కుంటోంది. ఈ కారణం వలన మహీంద్రా థార్ వెయిటింగ్ పీరియడ్ కూడా భారీగా పెరిగిపోయింది. ఇటీవల మహీంద్రా తమ థార్ను ఇన్ఫోటైన్మెంట్ లేకుండానే డీలర్షిప్ కేంద్రాలకు పంపిణీ చేసిన విషయం కూడా తెలిసినదే. - మరింత సమాచారం కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

ఇక కొత్త తరం మహీంద్రా స్కార్పియో విషయానికి వస్తే, ఇది పూర్తిగా సరికొత్త ఎక్స్టీరియర్ డిజైన్ను కలిగి ఉంటుంది. అయితే, ఇది దాని మునుపటి ఓవరాల్ బాక్సీ సిల్హౌట్ను మాత్రం అలానే నిలుపుకుంటుంది. దీని ఇంటీరియర్లో కూడా కీలకమైన మార్పులు ఉండే అవకాశం ఉంది.

కొత్త తరం స్కార్పియో అప్డేట్ చేయబడిన ల్యాడర్-ఫ్రేమ్ ఛాస్సిస్పై తయారు చేయనున్నారు. ఫలితంగా, కొత్త స్కార్పియో మునుపటి కన్నా విశాలమైనదిగా మరియు పొడవైనదిగా ఉండే అవకాశం ఉంది. ఇంజన్ విషయానికి వస్తే, కొత్త స్కార్పియోలో 2.2-లీటర్ టర్బో-డీజిల్ మరియు కొత్త 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్లను ఆఫర్ చేయవచ్చని అంచనా.

అలాగే, కొత్త తరం మహీంద్రా ఎక్స్యూవీ500 కూడా సరికొత్త ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ స్టైలింగ్ను కలిగి ఉండనుంది. ఇందులో పానరోమిక్ సన్రూఫ్, లెవల్ 2 అటానమస్ డ్రైవింగ్ అసిస్ట్ సిస్టమ్స్ (ఏడిఏఎస్) వంటి అధునాతన ఫీచర్లను ఆఫర్ చేసే అవకాశం ఉంది.

ఈ ఎస్యూవీని ప్రస్తుత మోడల్ కంటే మరింత వెడల్పుగా మరియు ధృడంగా ఉండే మోనోకోక్ ఛాస్సిస్పై నిర్మించనున్నారు. ఇది కూడా 2.2-లీటర్ టర్బో-డీజిల్ మరియు 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో రావచ్చని అంచనా. ఈ కారులో అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ ఫీచర్లను అందించనున్నారు.


Click it and Unblock the Notifications








