పెట్రోల్, డీజిల్ కార్ల ధరకే ఎలక్ట్రిక్ కార్లు, ధరలు దిగొస్తాయ్ అంటున్న మంత్రి!
ఇటీవలి కాలంలో దేశంలో ఇంధన ధరలు అమాంతం పెరిగిపోయిన నేపథ్యంలో ప్రజలు పెట్రోల్, డీజిల్తో నడికే వాహనాలకు స్వస్తి పలికి ఎలక్ట్రిక్ వాహనాలకు స్వాగతం పలుకుతున్నారు. ఈ నేపథ్యంలో, రానున్న రెండేళ్లలో ఎలక్ట్రిక్ వాహనాల ధరలు పెట్రోల్, డీజిల్తో నడిచే వాహనాల ధరలతో సమానంగా ఉంటాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు.

పెట్రోల్, డీజిల్ ఇంధనాలతో నడిచే వాహనాలతో పోలిస్తే, ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల కోసం దేశంలో ఉన్న మౌళిక సదుపాయాలు అంతంత మాత్రమే అయినప్పటికీ, ఇటీవలి కాలంలో ఇవి క్రమంగా అభివృద్ధి చెందుతున్నాయి. దీంతో, దేశంలో కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు మరియు కొత్త వాహన తయారీ సంస్థలు పుట్టుకొస్తున్నాయి.

మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కూడా అనేక రకాల ప్రోత్సాహకాలను మరియు భారీ సబ్సిడీలను అందిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో, వచ్చే 2 సంవత్సరాలలో పెట్రోల్, డీజిల్ కార్ల ధరలతో ఎలక్ట్రిక్ కార్ల ధరలు సరిపోతాయని కేంద్ర రవాణా మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల ఓ మీడియా కార్యక్రమంలో చెప్పారు.

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెప్పిన దాని ప్రకారం మరియు ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను పరిగణలోకి తీసుకుంటే, రానున్న రెండేళ్లలో దేశంలో ఎలక్ట్రిక్ కార్ల ధరలు సుమారు 50 శాతం వరకూ తగ్గాల్సి ఉంటుంది. ప్రాక్టికల్గా ఇది ఎంత వరకూ సాధ్యమవుతుందనేది కాలమే నిర్ణయించాలి.

ఉదాహరణకు, దేశంలో టాటా నెక్సాన్ పెట్రోల్ కారు ధర సుమారు రూ.7 లక్షలు ఉంటే, దాని ఎలక్ట్రిక్ వెర్షన్ ధర రూ.14 లక్షలుగా ఉంది. అంటే, టాటా నెక్సాన్ ఈవీ ధర దాని కౌంటర్ పెట్రోల్ వెర్షన్ ధరకు సమానంగా ఉండాలంటే, కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారు ధరను సుమారు రూ.7 లక్షలు (అంటే ప్రస్తుత ధరలో సగం) తగ్గించాల్సి ఉంటుంది.

ఈ విషయంపై నితిన్ గడ్కరీ వ్యాఖ్యానిస్తూ.. దేశంలోని అన్ని కొత్త వాహనాలు బిఎస్6 కాలుష్య నిబంధనలను పాటించేలా విజయవంతంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసాము. ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రతి సంవత్సరం 8,00,000 కోట్ల రూపాయల (108 బిలియన్ యూఎస్ డాలర్ల) ముడి చమురును దిగుమతి చేసుకునే భారీ సమస్యతో దేశం సతమతమవుతోంది. ఇది ఆర్థికంగా కూడా మనలను వెనక్కి నెట్టివేస్తోందని మనం అర్థం చేసుకోవాలి.

ఈ సమస్యను అటుంచితే, న్యూ ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో పెరుగుతున్న వాహన మరియు వాయు కాలుష్యం మరింత ఆందోళన కలిగించే విషయం. ప్రస్తుతం, భారతదేశంలో లిథియం అయాన్ బ్యాటరీలను స్థానికంగా 81 శాతం వరకు మనమే తయారుచేసుకుంటున్నాం. రెండేళ్లలోపు దీనిని 100 శాతానికి తీసుకెళ్లగలమనే విశ్వాసం నాకు ఉంది.

ఇదే గనుక జరిగితే రాబోయే రెండేళ్ళలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు మరియు నాలుగు చక్రాల వాహనల ధరలు వాటి సాంప్రదాయక పెట్రోల్, డీజిల్ వాహనాల ధరల స్థాయికి వస్తాయని నేను భావిస్తున్నాను. ఎలక్ట్రిక్ బస్సులు కూడా వాటి డీజిల్-శక్తితో నడిచే మోడళ్లకు సమానమైన ధరలకే రిటైల్ కావచ్చని ఆశిస్తున్నాము అని నితిన్ గడ్కరీ చెప్పుకొచ్చారు.

ఇదంతా పూర్తిగా 100 శాతం జరగటానికి కొన్ని రకాల సమస్యలు ఉన్నాయని, కాని ప్రస్తుతం ఈ ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమ పనిచేస్తున్న విధానాన్ని మరియు దాని వేగవంతమైన పనితీరును చూస్తుంటే దీన్ని సాధించడం పట్ల తనకు చాలా నమ్మకంగా ఉందని, మెటల్-అయాన్ మరియు మెటల్-ఎయిర్ బ్యాటరీ టెక్నాలజీస్ వంటి రంగాలలో అద్భుతమైన పని జరుగుతోందని అయన అన్నారు.

ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో ప్రధానంగా ఎక్కువ ఖర్చయ్యే ముడిసరుకు అందులో ఉపయోగించే బ్యాటరీలే. ప్రస్తుతం చాలా వరకూ ఆటోమొబైల్ కంపెనీలు ఈ బ్యాటరీల కోసం విదేశాలపై ఆధారపడుతున్నాయి. కొన్ని సంస్థలు పూర్తి బ్యాటరీ ప్యాక్లను దిగుమతి చేసుకుంటుంగా మరికొన్ని సంస్థలు బ్యాటరీ సెల్స్ని మాత్రమే దిగుమతి చేసుకొని ఇక్కడే అసెంబుల్ చేస్తున్నాయి. బ్యాటరీలను స్థానికంగా భారతదేశంలోనే తయారు చేసి, తక్కువ ధరకే అందుబాటులోకి తెచ్చినట్లయితే నితిన్ గడ్కరీ చెప్పినట్లు రెండేళ్లలో కాకపోయినా మరికొన్ని ఏళ్లలోనైనా ఎలక్ట్రిక్ వాహనాల ధరలు భారీగా తగ్గే ఆస్కారం ఉంటుంది.
Source: AutoCar Professional


Click it and Unblock the Notifications








