కరోనా వైరస్ ప్రభావం: భారత్లో జీప్ చిన్న ఎస్యూవీ లాంచ్ ఆలస్యం!
అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం జీప్, భారత మార్కెట్ కోసం రెండు కొత్త ఉత్పత్తులను ప్లాన్ చేసింది. వీటిలో ఒకటి ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న కంపాక్ ఎస్యూవీలో 7-సీటర్ వెర్షన్ కాగా, మరొకటి కొత్త జీప్ రెనెగేడ్ సబ్-ఫోర్ మీటర్ కాంపాక్ట్ ఎస్యూవీ.

జీప్ కాంపాస్ ఆధారిత కొత్త 7-సీటర్ ఎస్యూవీని జీప్ కమాండర్ అనే పేరుతో పిలవవచ్చని సమాచారం. ఇది ఈ ఏడాది మధ్య భాగం నాటికి మార్కెట్లోకి రావల్సి ఉంది. ఇప్పటికే, ఈ కారుకు సంబంధించిన స్పై చిత్రాలు కూడా అనేకసార్లు ఇంటర్నెట్లో లీక్ అయ్యాయి.

జీప్ 516 అనే కోడ్-నేమ్తో కంపెనీ ఓ సబ్-ఫోర్ మీటర్ ఎస్యూవీని కూడా అభివృద్ధి చేస్తోంది. ఇది 2022 నాటికి మార్కెట్లోకి రానుంది. జీప్ ఇండియా, భారత మార్కెట్లో తమ మొత్తం ప్రోడక్ట్ లైనప్ను 2024 నాటికి పూర్తిగా అప్గ్రేడ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. పాత మోడళ్ల స్థానంలో కంపెనీ పూర్తిగా సరికొత్త మోడళ్లను మరియు రిఫ్రెష్డ్ వెర్షన్లను తీసుకురానుంది.

అంతేకాకుండా, భారత మార్కెట్లో 2023 నాటికి తమ సెకండ్ జనరేషన్ జీప్ రెనెగేడ్ ఎస్యూవీని కూడా విడుదల చేయాలని భావిస్తోంది. జీప్ గత 2015లో తమ మొదటి తరం రెనెగేడ్ ఎస్యూవీని ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ తర్వాత 2018లో ఇందులో ఈ ఎస్యూవీలో ఓ ఫేస్లిఫ్ట్ మోడల్ను విడుదల చేసింది.

మొదటి తరం జీప్ రెనెగేడ్ ఎస్యూవీని పరిచయం చేసి ఇప్పటి సుమారు 6 సంవత్సరాలు పూర్తి కావడంతో కంపెనీ ఇందులో ఓ నెక్స్ట్ జనరేషన్ మోడల్ను తీసుకువచ్చేందుకు సిద్ధమవుతోంది. అయితే, గతేడాది ప్రపంచాన్ని కుదిపేసిన కోవిడ్-19 మహమ్మారి కారణంగా, ఈ ప్లాన్ కాస్తా వాయిదా పడింది.

వాస్తవ షెడ్యూల్ ప్రకారం, కొత్త తరం జీప్ రెనెగేడ్ కాంపాక్ట్ ఎస్యూవీని ఈ ఏడాదే మార్కెట్లో విడుదల చేయాల్సి ఉంది. కానీ, కరోనా వైరస్ కారణంగా, కంపెనీ ఇప్పుడు 2022లో తమ రెండవ తరం రెనెగేడ్ను ప్రారంభించాలని యోచిస్తోంది.

నిజానికి జీప్ 2022లో తమ సెకండ్ జనరేషన్ జీప్ రెనెగేడ్ మోడల్ని మార్కెట్లో ప్రవేశపెట్టినప్పటికీ, ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావటానికి మాత్రం మరొక ఏడాది సమయం పట్టే అవకాశం ఉంది. అంటే, ఈ కొత్త తరం కారును మనం రోడ్లపై చూడాలంటే, 2023 వరకూ ఆగాల్సిందే అన్నమాట.

నెక్స్ట్ జనరేషన్ జీప్ రెనెగేడ్ ఎస్యూవీని ప్రస్తుతం ఉపయోగిస్తున్న స్మాల్ వైడ్ 4×4 ప్లాట్ఫామ్పైనే నిర్మించనున్నట్లు సమాచారం. ఇదే ప్లాట్ఫామ్పై జీప్ కంపాస్ను కూడా తయారు చేస్తున్న విషయం తెలిసినదే. కొత్త తరం జీప్ రెనెగేడ్లో ప్లాట్ఫామ్ పాతదే అయినప్పటికీ, ఇందులో అధునాతన టెక్నాలజీ మరియు మోడ్రన్ హార్డ్వేర్ సెటప్ ఉంటుందని భావిస్తున్నారు.

ప్రస్తుత తరం జీప్ రెనెగేడ్తో పోల్చుకుంటే, మరింత మెరుగైన పనితీరు మరియు రహదారి సామర్థ్యాలను అందించడానికి కొత్త తరం జీప్ రెనెగేడ్లోని ప్లాట్ఫామ్లో కంపెనీ ఇంజనీర్లు మార్పులు చేసే అవకాశం ఉంది. ఇదే ప్లాట్ఫామ్పై కంపెనీ నుండి రాబోయే జీప్ 7-సీటర్ ఎస్యూవీ కూడా ఉంటుందని సమాచారం.

జీప్ ఇండియా ఈ కొత్త తరం రెనెగేడ్ కాంపాక్ట్ ఎస్యూవీని భారత మార్కెట్ కోసం కూడా పరిగణిలోకి తీసుకోవచ్చని తాజా నివేదికలు సూచిస్తున్నాయి. అయితే, ఈ విషయంపై జీప్ ఇండియా ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

రెండవ తరం జీప్ రెనెగేడ్ కాంపాక్ట్ ఎస్యూవీని మూడు ఇంజన్ ఆప్షన్లలో అందించే అవకాశం ఉంది. ఇందులో మొదటిది 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ డీజిల్ ఇంజన్, రెండవది 1.6-లీటర్ ఎమ్జెడి డీజిల్ మరియు మూడవది 1.3-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్.

ఈ ఇంజన్లు వివిధ రకాల మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్లతో లభ్యం కానున్నాయి. భవిష్యత్ మార్కెట్ ట్రెండ్కు అనుగుణంగా, కంపెనీ కొత్త మోడల్లో ప్లగ్-ఇన్ హైబ్రిడ్ మరియు ఫుల్ ఎలక్ట్రిక్ పవర్ట్రైన్ ఆప్షన్లను కూడా అందించే అవకాశం ఉంటుంది.


Click it and Unblock the Notifications








