భారీగా పెరిగిన టొయోటా గ్లాంజా, అర్బన్ క్రూయిజర్ ధరలు
జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా కిర్లోస్కర్ మోటార్ భారత మార్కెట్లో విక్రయిస్తున్న గ్లాంజా హ్యాచ్బ్యాక్ మరియు అర్బన్ క్రూయిజర్ కాంపాక్ట్ ఎస్యూవీల ధరలను కంపెనీ భారీగా పెంచింది. మోడల్ మరియు వేరియంట్ను బట్టి ఈ కార్ల ధరలు రూ.33,900 వరకూ పెరిగాయి.

గత నెలలో టొయోటా తమ ఇతర వాహనాల ధరలను పెంచింది, అయితే ఈ రెండు మోడళ్ల ధరను మాత్రం పెంచలేదు. ఇందుకు గల కారణాలను కూడా టొయోటా వెల్లడించలేదు. బహుశా ఇందుకు కారణం, టొయోటా ఈ రెండు మోడళ్లను టొయోటా ఉత్పత్తి చేస్తుండకపోవటమని తెలుస్తోంది.

మారుతి సుజుకి నుండి టొయోటా కొనుగోలు చేసిన బాలెనో మరియు విటారా బ్రెజ్జా మోడళ్లను గ్లాంజా మరియు అర్బన్ క్రూయిజర్ పేర్లతో టొయోటా తమ బ్రాండ్ క్రింద రీబ్యాడ్జ్ చేసి విక్రయిస్తోన్న సంగతి తెలిసినదే. బహుశా మారుతి ఈ మోడళ్ల ధరలను పెంచడంతో టొయోటా కూడా తమ రీబ్యాడ్జ్ వెర్షన్ ధరలను పెంచినట్లుగా తెలుస్తోంది.

దేశీయ విపణిలో టొయోటా గ్లాంజా హ్యాచ్బ్యాక్ను జి మరియు వి అనే రెండు వేరియంట్లలో విక్రయిస్తున్నారు. గ్లాంజా జి మాన్యువల్ మరియు ఆటోమేటిక్ వేరియంట్ ధరలను రూ.15,700 మేర పెంచగా, హైబ్రిడ్ వేరియంట్ ధరను రూ.33,900 మేర పెంచారు. ఇకపోతే, గ్లాంజా వి వేరియంట్ ధరను రూ.20,000 మేర పెంచారు.

టొయోటా అర్బన్ క్రూయిజర్ కాంపాక్ట్ ఎస్యూవీ విషయానికి వస్తే, ఇది మిడ్ మరియు హై గ్రేడ్ వేరియంట్లలో మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్లతో లభిస్తోంది. వీటి ధరలను వరుసగా రూ.12,500 మరియు రూ.2,500 మేర పెంచారు. అదే సమయంలో, దాని ప్రీమియం గ్రేడ్ ధరను రూ.5,500 మేర పెంచారు.

ఇదివరకు ధరల పెంపులో టొయోటా కిర్లోస్కర్ తమ ఇన్నోవా క్రిస్టా యొక్క అన్ని వేరియంట్ల ధరను రూ.26,000 మేర పెంచింది. ఇన్నోవా పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ధరల పెంపు అనంతరం ఈ కారు యొక్క బేస్ వేరియంట్ ధర రూ.16.52 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, ఇందులో టాప్-ఎండ్ వేరియంట్ ధర రూ.24.59 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

టొయోటా కిర్లోస్కర్ ఫుల్-సైజ్ ఎస్యూవీ ఫార్చ్యూనర్ను పెట్రోల్ ఇంజన్ ఆప్షన్తో రెండు వేరియంట్లలో, డీజిల్ ఇంజన్ ఆప్షన్తో నాలుగు వేరియంట్లలో విక్రయిస్తుంది. ఇందులో లెజెండ్ ఎడిషన్ అనే పెర్ఫార్మెన్స్ వేరియంట్ను కూడా కంపెనీ విక్రయిస్తోంది.

గత ధరల పెంపులో కంపెనీ ఈ మోడల్ ధరలను గరిష్టంగా రూ.36,000 నుండి రూ.72,000 వరకూ పెంచింది. తాజా ధరల పెంపు అనంతరం టొయోటా ఫార్చ్యూనర్ ధరలు రూ.29.98 లక్షల నుంచి రూ.33.43 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉన్నాయి.

ఇక టొయోటా విక్రయిస్తున్న ప్రీమియం సెడాన్ క్యామ్రీ విషయానికి వస్తే, గత నెలలో కంపెనీ ఈ మోడల్ ధరను గరిష్టంగా రూ.1.18 లక్షల వరకూ పెంచింది. ప్రస్తుతం భారత మార్కెట్లో టొయోటా క్యామ్రీ హైబ్రిడ్ వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. దీని పాత ధర రూ .39.41 లక్షలు కాగా, ఇప్పుడు దాని కొత్త ధర రూ.40.59 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

ఇదిలా ఉంటే, దేశంలో విస్తరిస్తున్న కరోనా వైరస్ సెకండ్ వేవ్ నేపథ్యంలో, టొయోటా ఇటీవలే దేశంలోని తమ రెండు ప్లాంట్లలో ఏప్రిల్ 26 నుండి మే 14వ తేదీ వరకు ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సమయాన్ని కంపెనీ తమ వార్షిక నిర్వహణ కార్యక్రమం కోసం ఉపయోగించుకోనుంది.


Click it and Unblock the Notifications








