ఎలక్ట్రిక్ కార్ల కోసం ప్రత్యేకమైన ఎనర్జీడ్రైవ్ టైర్లను విడుదల చేసిన సియట్ (Ceat Energydrive Tyres)
ప్రముఖ టైర్ల తయారీ సంస్థ సియట్ టైర్స్ (Ceat Tyres) భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన శబ్ధం రాని టైర్లను విడుదల చేసింది. సియట్ ఎనర్జీడ్రైవ్ టైర్స్ (Ceat Energydrive Tyres) పేరుతో విడుదలైన ఈ టైర్లు ఎలక్ట్రిక్ కార్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన సైలెంట్ టెక్నాలజీపై ఆధారపడి ఉన్నాయని మరియు ఇవి ఎలక్ట్రిక్ కార్ల యొక్క రేంజ్ ని పెంచడంలో కూడా ప్రభావవంతంగా ఉంటాయని కంపెనీ పేర్కొంది.

ఎలక్ట్రిక్ కార్లలో ఇంజన్లు ఉండవు కాబట్టి అవి చాలా నిశ్శబ్దంగా ఉంటాయి, దీని కారణంగా ఎలక్ట్రిక్ కారు క్యాబిన్లో టైర్ శబ్దం ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో, సియట్ టైర్స్ యొక్క కొత్త ఎనర్జీడ్రైవ్ టైర్లు రోడ్డు ఉపరితలంపై నడుస్తున్నప్పుడు తక్కువ శబ్దం వచ్చేలా రూపొందించబడ్డాయి. ఈ టైర్లు కంపనాలను గ్రహించడం ద్వారా శబ్దాన్ని తగ్గిస్తాయని కంపెనీ తెలిపింది.

సియట్ ఎనర్జీడ్రైవ్ టైర్లు ఉపరితలంతో సంబంధంలో ఉన్నప్పుడు తక్కువ డ్రాగ్ను ఉత్పత్తి చేయడానికి వీలుగా ప్రత్యేకంగా రూపొందించబడిందని, ఫలితంగా ఇవి ఎలక్ట్రిక్ కారు యొక్క పరిధిని (రేంజ్ను) పెంచడంలో సహాయపడుతాయని కంపెనీ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో, కార్ల తయారీ కంపెనీలే కాకుండా ఆటో పరికరాలను తయారు చేసే విడిభాగాల తయారీదారులు కూడా ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల అవసరాలను ప్రత్యేకంగా పరిష్కరించే ఉత్పత్తులను అందిస్తున్నారు.

భారతదేశంలో కూడా ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ చాలా వేగంగా జరుగుతోంది. ప్రత్యేకించి, ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన విభాగంలో ఈ వేగం మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే అనేక కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు మార్కెట్లోకి రాగా, మరికొన్ని అభివృద్ధి దశలో ఉన్నాయి. అంతేకాకుండా, పెట్రోల్/డీజిల్ వాహనాలను విక్రయించే ఆటోమొబైల్ కంపెనీలు కూడా ఇప్పుడు తమ లైనప్ లో ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తున్నాయి.

భారత ఈవీ మార్కెట్లో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాల విభాగంలో ప్రస్తుతం టాటా మోటార్స్ ఆధిపత్యం చెలాయిస్తోంది. అదే సమయంలో, నేడు ప్రతి లగ్జరీ కార్ తయారీదారులు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఎలక్ట్రిక్ మోడళ్లను భారతదేశంలో విక్రయిస్తున్నారు. ఈ అభివృద్ధి ఇలానే కొనసాగితే, రానున్న రోజుల్లో దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం తారాస్థాయికి చేరుకుంది. కాబట్టి, ఈ డిమాండ్ కి తగినట్లుగా విడిభాగాల తయారీదారులు కూడా కొత్త రకం ఉత్పత్తులను అందించాల్సి ఉంటుంది.

ఇప్పుడు సియట్ టైర్స్ కూడా అదే చేస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల టైర్ అవసరాలను తీర్చేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన ఎనర్జీడ్రైవ్ టైర్స్ ను విడుదల చేసింది. ఈ సందర్భంగా సియట్ ఇండియా సీఓఓ అర్నాబ్ బెనర్జీ మాట్లాడుతూ, ఫోర్ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాలను లక్ష్యంగా చేసుకుని భారతదేశంలో ఎనర్జీడ్రైవ్ వంటి టైర్ను విడుదల చేయడం ఇదే మొదటిసారి అని, 'సైలెంట్' టెక్నాలజీతో తయారైన ఈ ఎనర్జీడ్రైవ్ టైర్ దేశీయ ఎలక్ట్రిక్ వాహనాల యజమానుల సమస్యను పరిష్కరిస్తుందని మరియు ఎలక్ట్రిక్ వాహనాల యజమానులకు అత్యుత్తమ టైర్లను తీసుకురావడం కొనసాగిస్తూనే ఉంటామని చెప్పారు.

టైర్ రేటింగ్ విధానం అమలులోకి వస్తుంది..
అక్టోబర్ 2022 నుండి దేశవ్యాప్తంగా కారు, బస్సు మరియు ట్రక్కుల కోసం ఉపయోగించే టైర్లకు కొత్త ప్రమాణాలు అమలు చేయబడనున్నాయి. ఇకపై కొత్త టైర్లు రోలింగ్ రెసిస్టెన్స్, వెట్ గ్రిప్ మరియు రోలింగ్ నాయిస్ ఎమిషన్ కోసం నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని కేంద్ర రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) తమ అధికారిక నోటిఫికేషన్లో తెలిపింది.

అక్టోబర్ 2022 నుండి, కారు, బస్సు మరియు ట్రక్ టైర్ తయారీదారులు తయారు చేసే టైర్లన్నీ కూడా ఆటోమోటివ్ ఇండస్ట్రీ స్టాండర్డ్ (AMI) 142:2019 లో నిర్వచించిన పరిశ్రమ ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని మంత్రిత్వ శాఖ తమ నోటిఫికేషన్ లో పేర్కొంది. ఈ ప్రమాణాలు కొత్త టైర్ యొక్క రోలింగ్ రెసిస్టెన్స్, వెయిట్ గ్రిప్ మరియు రోలింగ్ సౌండ్ కోసం అవసరాలను నిర్వచిస్తాయి. ఈ నిబంధనతో భారతదేశం UNECE (యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ కమిషన్ ఫర్ యూరప్) ప్రమాణాలకు అనుగుణంగా ఉండే దేశంగా మారుతుందని సమాచారం.

టైర్ యొక్క రోలింగ్ రెసిస్టెన్స్ వాహనం మైలేజీపై ప్రభావం చూపుతుంది, అయితే టైర్ వెట్ గ్రిప్ తడి రోడ్లపై టైర్ బ్రేకింగ్ పనితీరును వివరిస్తుంది. అదే సమయంలో, టైర్ యొక్క రోలింగ్ శబ్దం రహదారిపై టైర్ యొక్క రాపిడి ద్వారా ఎంత శబ్దం ఉత్పత్తి అవుతుందో తెలియజేస్తుంది. కాబట్టి, వినియోగదారులు ఈ ప్రమాణాలను తనిఖీ చేసుకొని, ఉత్తమమైన వాటిని తమ వాహనాలలో అమర్చుకునేందుకు వీలవుతుంది. ఈ ప్రమాణాల కారణం టైర్ల నాణ్యత మరియు వాటి భద్రత కూడా పెరుగుతుందని భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications








