హోండా కూడా మరో ఫోర్డ్ అవుతుందా? భారత్ వదిలిపోతుందా? కొత్తగా మరో 3 కార్లు డిస్కంటిన్యూ కానున్నాయా?
భారతదేశంలో హోండా కార్లు ఒకప్పుడు తిరుగులేనివిగా ఉండేవి. ధర అధికంగా ఉన్నప్పటికీ, ప్రారంభంలో కేవలం పెట్రోల్ కార్లను విక్రయించినప్పటికీ హోండా కార్లను కొనేందుకు కస్టమర్లు క్యూ కట్టేవారు. అయితే, ఇప్పుడు పరిస్థితి మునుపటిలా లేదు. దీనికితోడు హోండా కూడా తమ ప్రోడక్ట్ లైనప్ లో మోడళ్లను ఒక్కొక్కటిగా డిస్కంటిన్యూ చేస్తూ వస్తోంది. హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ (Honda Cars India Limited) భారతదేశంలో ఇప్పటికే అకార్డ్ (Honda Accord), సిఆర్-వి (Honda CR-V), సివిక్ (Honda Civic), బ్రయో (Honda Brio), మొబిలియో (Honda Mobilio) మరియు బిఆర్-వి (Honda BR-V) వంటి మోడళ్లను నిలిపివేసింది.

తాజాగా సమాచారం ప్రకారం, హోండా ఇప్పుడు జాజ్ (Honda Jazz) హ్యాచ్బ్యాక్, డబ్ల్యూఆర్-వి (Honda WR-V) క్రాసోవర్ మరియు 4వ తరం హోండా సిటీ (4th Gen Honda City) సెడాన్ లను కూడా నిలిపివేయనుంది. ఒకవేళ, ఈ మూడు మోడళ్లు కూడా భారత మార్కెట్ నుండి వెళ్లిపోతే, హోండా తమ ఇండియన్ ప్రోడక్ట్ లైనప్ లో కేవలం మూడు మోడళ్లను మాత్రమే కలిగి ఉంటుంది. వీటిలో అమేజ్ (Honda Amaze) కాంపాక్ట్ సెడాన్, 5వ తరం హోండా సిటీ (5th Gen Honda City) సెడాన్ మరియు కొత్తగా వచ్చిన సిటీ ఇ-హెచ్ఈవి (Honda City e:HEV) హైబ్రిడ్ కారు ఉన్నాయి.

ఎకనామిక్ టైమ్స్ ఆటోలో ప్రచురించబడిన నివేదిక ప్రకారం, జపాన్ కు చెందిన కార్ల తయారీ సంస్థ హోండా యొక్క భారతీయ విభాగమైన హోండా కార్స్ ఇండియా లిమిటెడ్ భారత మార్కెట్లో జాజ్, డబ్ల్యూఆర్-వి మరియు 4వ తరం సిటీ సెడాన్ ఉత్పత్తిని నిలిపివేయవచ్చు. వీటి ఉత్పత్తిని నిలిపివేయడంతో పాటుగా భారతదేశంలో ఈ మూడు మోడళ్ల విక్రయాలు కూడా నిలిపివేయబడతాయి.

ఈ నివేదిక ప్రకారం, హోండా జాజ్ ఉత్పత్తి అక్టోబర్ 2022 తర్వాత నిలిపివేయబడుతుంది, అయితే డబ్ల్యూఆర్-వి క్రాస్ఓవర్ ఉత్పత్తి మాత్రం మార్చి 2023 తర్వాత నిలిపివేయబడుతుంది. హోండా యొక్క మిడ్-సైజ్ సెడాన్ అయిన 4వ తరం సిటీ ఉత్పత్తి ఈ ఏడాది డిసెంబర్ వరకూ మాత్రమే జరుగుతుంది. అయితే, కంపెనీ తమ ఐదవ తరం హోండా సిటీ ఉత్పత్తిని మాత్రం అలానే కొనసాగించబోతోంది.

హోండా బ్రాండ్ నుండి భారతదేశంలో అత్యల్పంగా అమ్ముడవుతున్న కార్లలో హోండా డబ్ల్యూఆర్-వి మరియు హోండా జాజ్ మోడళ్లు ఉన్నాయి. ఈ రెండు కార్లను నిలిపివేయడం వల్ల హోండాకు ఈ సెగ్మెంట్ పూర్తిగా ఖాళీ అవుతుందని భావిస్తున్నారు. అయితే, కంపెనీ త్వరలో మరిన్ని కొత్త కార్లను భారత మార్కెట్లో విడుదల చేయడంతో ఈ విభాగంలో పునరాగమనం చేయవచ్చని కూడా నివేదికలు సూచిస్తున్నాయి.

డబ్ల్యుఆర్-వి క్రాసోవర్ ని నిలిపివేసిన తర్వాత హోండా ఓ కొత్త కాంపాక్ట్ ఎస్యూవీని విడుదల చేయవచ్చని చెబుతున్నారు. కంపెనీ వచ్చే ఏడాది ఆగస్టు నుండి 3US/31XA అనే కోడ్నేమ్తో కొత్త కాంపాక్ట్ ఎస్యూవీని ఉత్పత్తిని ప్రారంభించే అవకాశం ఉంది. మొదటి సంవత్సరంలో కంపెనీ ఈ ఎస్యూవీ యొక్క 40,000 యూనిట్లను ఉత్పత్తి చేస్తుంది. ఎస్యూవీ విభాగంలో తలపడేందుకు హోండాకు బలమైన మోడల్ లేనందున, కంపెనీ కార్ మార్కెట్ వాటా 3 శాతానికి పడిపోయింది.

ఈ నేపథ్యంలో, కొత్తగా రాబోయే హోండా ఎస్యూవీపై కంపెనీ భారీ అంచనాలు పెట్టుకుంది. మరోవైపు, ఎస్యూవీ విభాగంలో కియా మోటార్స్, హ్యుందాయ్, టాటా మోటార్స్ మరియు మహీంద్రా వంటి తయారీదారులు కొత్త ఎత్తులకు చేరుకుంటున్నారు. కాబట్టి, హోండా కూడా భారత మార్కెట్లో పోటీని తట్టుకుని బలమైన బ్రాండ్ గా నిలబడాలంటే, మరిన్ని కొత్త కార్లను మరియు ఎస్యూవీలను విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం, హోండా నుండి లభిస్తున్న అతి తక్కువ ధర కలిగిన కారు అమేజ్ మాత్రమే. మార్కెట్లో ఈ కారు ధర రూ.6.56 లక్షల నుండి ప్రారంభం అవుతుంది.

కాగా, డిస్కంటిన్యూ కానున్న హోండా జాజ్ ధరలు రూ.7.90 లక్షలు, హోండా డబ్ల్యూఆర్-వి ధరలు రూ.8.99 లక్షలు మరియు 4వ తరం హోండా సిటీ ధరలు రూ.9.49 లక్షల నుండి ప్రారంభం అవుతాయి. అవి కాకుండా 5వ తరం హోండా సిటీ సెడాన్ ధరలు రూ.11.46 లక్షలు మరియు కొత్తగా విడుదల చేయబడిన హోండా సిటీ హైబ్రిడ్ కారు ధరలు రూ.19.49 లక్షల నుండి ప్రారంభం అవుతాయి.

హోండా ఎలక్ట్రిక్ కార్లు కూడా వస్తున్నాయ్..
భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని హోండా ఈ విభాగంలో కూడా తన సత్తా చాటేందుకు ప్లాన్ చేస్తోంది. దీని కోసం, హోండా జపాన్ కంపెనీ సోనీతో ఓ భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ భాగస్వామ్యం కింద 2025 లో మొదటి ఎలక్ట్రిక్ కారును తీసుకురావడానికి ఇరు కంపెనీలు సన్నాహాలు చేస్తున్నాయి. హోండా 2030 నాటికి తమ లైనప్ లో మొత్తం 30 ఎలక్ట్రిక్ కార్లను కలిగి ఉండాలని చూస్తోంది. హోండా ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో హోండా వన్ ఈవీ మరియు హోండా-ఇ వంటి ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోంది.


Click it and Unblock the Notifications








