ఫ్రెంచ్ టచ్తో తిరిగి భారత్లో విడుదల కానున్న క్లాసిక్ అంబాసిడర్ కారు (Ambassador Car)
భారతీయులకు కారు అనగానే ముందుగా గుర్తుకువచ్చేది హిందూస్థాన్ మోటార్స్ వారి అంబాసిడర్ కారు (Ambassador Car). పబ్లిక్ టాక్సీగా, ప్రైవేట్ కారుగా, సెలబ్రిటీలు మెచ్చిన వాహనంగా, విఐపిలకు అధికారిక రవాణా సాధనంగా ఇలా ఎన్నో రూపాలలో అంబాసిడర్ కారు కనిపించింది. అయితే, మారుతున్న కాలం మరియు కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా అంబాసిడర్ కారు మారలేకపోయింది. దీనికితోడు, కార్ మార్కెట్లో పెరిగిన పోటీలో అంబాసిడర్ నిలబడలేకపోయింది. ఫలితంగా, ఈ బ్రాండ్ ఇప్పుడు అటకెక్కి కూర్చుంది. అయితే, తాజా సమాచారం ప్రకారం, ఈ ఐకానిక్ కారు ఇప్పుడు ఓ ఫ్రెంచ్ కంపెనీతో కలిసి తిరిగి భారత మార్కెట్లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఆ వివరాలేంటో చూద్దాం రండి.

కొత్త అంబాసిడర్ కారు రోడ్లపైకి రావడానికి కేవలం 2 సంవత్సరాల సమయం మాత్రమే ఉందని ఓ నివేదిక సూచిస్తోంది. ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ ప్యూజో (Peugeot) యాజమాన్యంలో ఉన్న కొత్త అంబాసిడర్ రెండేళ్లలో భారతదేశానికి వస్తుందని టైమ్స్ ఆఫ్ ఇండియా యొక్క కొత్త నివేదిక పేర్కొంది. హింద్ మోటార్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Hind Motor Financial Corporation) మరియు ప్యూజో మధ్య ఏర్పడిన జాయింట్ వెంచర్ కొత్త అంబాసిడర్ కారు కోసం కొత్త డిజైన్ మరియు కొత్త ఇంజన్పై పని చేస్తోందని సదరు నివేదికలో పేర్కొన్నారు.

హిందుస్థాన్ మోటార్స్ డైరెక్టర్ ఉత్తమ్ బోస్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ, కొత్త ఇంజన్ కోసం మెకానికల్ మరియు డిజైన్ పనులు అధునాతన దశకు చేరుకున్నాయని, కొత్త లుక్ అంబాసిడర్ 2.0 (Ambassador 2.0) ని తీసుకురావడానికి పనులు జరుగుతున్నాయని చెప్పారు. ఈ మీడియా నివేదిక మినహా ఇరు కంపెనీలు ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, త్వరలోనే ఈ విషయం గురించి కొత్తగా ఏర్పడిన జాయింట్ వెంచర్ మరిన్ని వివరాలను వెల్లడించే అవకాశం ఉందని భావిస్తున్నారు.

అంబాసిడర్ కారు భారతీయ రహదారులకు రారాజు అని చెప్పొచ్చు. అయితే, ఇదివరకు చెప్పుకున్నట్లుగా, కాలానికి అనుగుణంగా కంపెనీ ఈ కారులో పెద్దగా ఎలాంటి డిజైన్ మార్పులు మరియు అప్గ్రేడ్లు చేయకపోవడంతో పాటు మారుతి సుజుకి మరియు ఇతర కార్ల తయారీదారుల నుండి మరింత సరసమైన మాస్-మార్కెట్ కార్లు పెరగడం వల్ల ఒకప్పుడు భారతదేశ జాతీయ కారుగా పరిగణించబడిన అంబాసిడర్ ఇప్పుడు కనుమరుగైపోయింది. అయితే, ఓ చరిత్ర పుస్తకాలను తిరగేసి, భారతదేశ రహదారులను పాలించడానికి మొదటి అంబి ఇక్కడికి ఎలా వచ్చాడో చూద్దాం రండి.

భారతదేశంలో అంబాసిడర్ బ్యాడ్జ్ ధరించిన మొట్టమొదటి కారు 1956 మోరిస్ ఆక్స్ఫర్డ్ సిరీస్ 3 ఆధారంగా రూపొందించబడింది. 1957లో, మోరిస్ ఆక్స్ఫర్డ్ సిరీస్ 3 కారుని తయారు చేసేందుకు హిందూస్థాన్ మోటార్స్ బ్రిటిష్ మోటార్ కార్పొరేషన్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ కంపెనీ ఇంతకుముందు మోరిస్ ఆక్స్ఫర్డ్ సిరీస్ 2 కార్లను హిందుస్థాన్ ల్యాండ్మాస్టర్గా విక్రయించింది. మొదటి తరం హిందూస్థాన్ అంబాసిడర్ 1957 నుండి 1962 వరకు ఉత్పత్తిలో ఉంది. ఈ కారులో 1959 వరకు 1,476 సిసి సైడ్-వాల్వ్ పెట్రోల్ ఇంజన్ను ఉపయోగించారు. ఆ తర్వాత దాని స్థానంలో బ్రిటిష్ మోటార్ కార్పొరేషన్ 1,489 సిసి ఓవర్ హెడ్-వాల్వ్ ఇంజన్ వచ్చింది.

కాగా, రెండవ తరం హిందుస్థాన్ అంబాసిడర్ సుమారు 1962లో పరిచయం చేయబడింది. ఈ కొత్త-తరం మార్క్ 2 అంబాసిడర్లో మోరిస్ మినీలో ఉన్నటువంటి కొత్త గ్రిల్ మరియు రీడిజైన్ చేయబడిన డాష్బోర్డ్ మరియు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్తో ట్వీక్ చేయబడిన ఇంటీరియర్లు ఉండేవి. ఈ మోడల్ 1970లలో స్వల్పకాలిక ఎస్టేట్ వెర్షన్ను కూడా సృష్టించింది, అయితే, దాని ఉత్పత్తి 1975లో ఆగిపోయింది.

ఇక మూడవ తరం హిందూస్థాన్ అంబాసిడర్ 1975లో వచ్చింది. ఇది సవరించిన ఫ్రంట్ ఎండ్తో భారతదేశ వీధుల్లోకి వచ్చింది. ఈ మోడల్ 1979 వరకు మాత్రమే అందుబాటులో ఉంది. 1977 మరియు 1978 మోడల్ ఇయర్స్ అంబాసిడర్ మార్క్ 3 కారులో మరింత శక్తివంతమైన 1,760 సిసి 4-సిలిండర్ మోరిస్ ఇంజన్ ను ఉపయోగించే వారు. ఈ ఇంజన్ వలన కారుకు ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్ను అమర్చడం సాధ్యమైంది.

ఆ తర్వాస 1979లో, భారతదేశంలో నాల్గవ-తరం అంబాసిడర్ మార్క్ 4 కారు ప్రారంభించబడింది. ఈ కొత్త అంబాసిడర్ కారు భారతీయ మార్కెట్లో డీజిల్తో నడిచే మొట్టమొదటి కారుగా మారింది. అయితే, ఈ మోడల్ మొదట ప్రభుత్వ అధికారులు మరియు టాక్సీలకు మాత్రమే కేటాయించబడింది. మార్క్ 4 అంబాసిడర్ జీవితపు ముగింపు సమయంలో మారుతి సుజుకి 800 మొదటిసారిగా పరిచయం చేయబడింది. ఇక్కడి నుండే అంబాసిడర్ పతనం కూడా ప్రారంభమైంది.

సుమారు 1990లో, ఐదవ-తరం అంబాసిడర్ నోవా భారతదేశంలో విడుదలైంది. మునుపటి మార్క్ 4 కారు మాదిరిగానే, 5వ తరం మోడల్ కూడా పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో అందించబడింది. 1992లో, హిందుస్తాన్ మోటార్స్ అంబాసిడర్ 1800 ISZను పరిచయం చేసింది, ఇందులో ఫ్లోర్-మౌంటెడ్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్బాక్స్తో జతచేయబడిన 1,817 సిసి ఇసుజు ఇంజన్ ఉండేది. 1998లో, ఈ 1800 ISZ మోడల్ క్లాసిక్ పేరును పొందింది మరియు పెట్రోల్/సిఎన్జి లేదా డీజిల్తో నడిచే 1.5 నుండి 2.0-లీటర్ల వరకు ఇంజన్లతో అందించబడింది.

చివిరగా 2003లో, అంబాసిడర్ గ్రాండ్ భారతీయ రహదారులపైకి ప్రవేశించింది మరియు ఒక సంవత్సరం తర్వాత అవిగో చాలా సమూలమైన డిజైన్ మార్పును కలిగి ఉంది (కనీసం అంబాసిడర్ లైనప్కు సంబంధించి). ఆ తర్వాత 2011లో, కొత్త BS-IV నిబంధనలను పరిచయం చేసిన తర్వాత ఇది 1.5-లీటర్ డీజిల్ వెర్షన్కు తగ్గించబడింది. హిందూస్తాన్ మోటార్స్ 2013 అంబాసిడర్ ఎన్కోర్లో సవరించిన BS-IV కంప్లైంట్ వెర్షన్ ఇంజన్ను తిరిగి కొనుగోలు చేసింది.

అయితే, ఆ సమయానికి ఈ బ్రాండ్ అమ్మకాలు పూర్తిగా పతనం అయ్యాయి. దాదాపు 1990 కాలంలో వార్షికంగా 20,000 యూనిట్ల అంబాసిడర్ కార్లు అమ్ముడైతే, 2014లో ఇవి కేవలం 2,000 యూనిట్లకు క్షీణించాయి. దీంతో హిందూస్తాన్ మోటార్స్ అంబాసిడర్పై ఆశలు వదులుకుంది. కాగా, 2017లో అంబాసిడర్ బ్రాండ్ను రూ.80 కోట్లకు ఫ్రెంచ్ కార్ కంపెనీ ప్యూజో కొనుగోలు చేసింది. ఇప్పుడు ఇదే కంపెనీ తమ ఫ్రెంచ్ ఇంజనీరింగ్ నైపుణ్యంతో అంబాసిడర్ 2.0 ని మరింత అధునాతనంగా పరిచయం చేయబోతోంది.


Click it and Unblock the Notifications








