ఫోర్స్ మోటార్స్ నుంచి మరో వెయ్యి కోట్ల పెట్టుబడి
పూణేకు చెందిన ప్రముఖ యుటిలిటీ వానాల తయారీ సంస్థ ఫోర్స్ మోటార్స్ రానున్న నాలుగేళ్లలో రూ.1,000 కోట్ల పెట్టుబడులను వెచ్చించనున్నట్లు పేర్కొంది. ఈ మొత్తాన్ని ఉత్పత్తుల అభివృద్ధి కోసం మరియు బిఎమ్డబ్ల్యూ వాహనాల కోసం ప్రత్యేకంగా ఇంజన్ అసెంబ్లింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయటానికి వినియోగించనున్నట్లు ఫోర్స్ మోటార్స్ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు.
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధునికీకరించడం, కొత్త వాహనాలను అభివృద్ధి చేయటం అలాగే చెన్నైలో బిఎమ్డబ్ల్యూ కోసం ప్రత్యేక ఇంజన్ అసెంబ్లింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయటం కోసం రూ.1,000 కోట్ల పెట్టుబడులను వెచ్చిస్తున్నట్లు ఫోర్స్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రసన్ ఫిరోడియా తెలిపారు. తాము 2012లో ప్రకటించిన రూ.1000 కోట్ల పెట్టుబడికి అదనంగా ఈ తాజా పెట్టుబడులను వెచ్చిస్తున్నట్లు ఆయన వివరించారు.

పాపులర్ టెంపో ట్రావెలర్తో పాటుగా పలు ఇతర వాణిజ్య, ప్యాసింజర్ వాహనాలను విక్రయిస్తున్న ఫోర్స్ మోటార్స్ మరికొద్ది సంవత్సరాలలో ఓ సరికొత్త వ్యాన్ను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు పేర్కొంది. ఈ కంపెనీ ట్రావెలర్ రేంజ్ ప్యాసింజర్ క్యారీయర్లను మధ్యప్రదేశ్లోని పీతంపూర్ ప్లాంట్లో ఉత్పత్తి చేస్తోంది.
కాగా.. చెన్నైలో బిఎమ్డబ్ల్యూ కోసం ఏర్పాటు చేయనున్న ప్లాంట్ గురించి ఫిరోడియాను ప్రశ్నించగా, అందుకు ఆయన సమాధానమిస్తూ.. చెన్నైలో బిఎమ్డబ్ల్యూ కోసం ప్రత్యేక ఇంజన్ అసెంబ్లింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు గాను తాము రూ.100 కోట్ల పెట్టుబడిని వెచ్చిస్తున్నామని, ఇది వచ్చే ఏడాది జనవరి నాటికి అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
కొన్ని ప్రత్యేక పరికరాల కోసం బిఎమ్డబ్ల్యూ కూడా భారీ మొత్తంలోనే పెట్టుబడి పెడుతోందని ఆయన చెప్పారు. అయితే అది ఎంత మొత్తం అనేది మాత్రం ఆయన తెలుపలేదు. ఫోర్స్ మోటార్స్ ప్రస్తుతం వివిధ మెర్సిడెస్ బెంజ్ మోడళ్ల కోసం ఇంజన్లను అసెంబుల్ చేస్తోంది. త్వరలోనే జిఎల్ఏ, సిఎల్ఏ మోడళ్లకు కూడా ఇంజన్లను అసెంబుల్ చేయాలని సన్నాహాలు చేస్తోంది.


Click it and Unblock the Notifications








