ఏఎమ్టి వెర్షన్ ఎర్టిగాను విడుదల చేయనున్న మారుతి!?
భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా, గడచిన 2012 సంవత్సరంలో దేశీయ విపణిలో విడుదల చేసిన 'ఎర్టిగా' (Ertiga)లో కంపెనీ ఓ ఫేస్లిఫ్ట్ వెర్షన్ను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. కంపెనీ ఇప్పటికే ఈ మోడల్ను ఇండియన్ రోడ్లపై టెస్టింగ్ చేస్తోంది. ఈ ఫేస్లిఫ్ట్ కారుకు సంబంధించి పలు స్పైషాట్స్ కూడా నెట్లో హల్చల్ చేస్తున్నాయి.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే, 2015 మారుతి సుజుకి ఎర్టిగా మోడల్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్తో పాటుగా ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ (ఏఎమ్టి)తో కూడా లభ్యం కానుందట. భారత్లో ఇప్పటికే ఏఎమ్టి కార్లకు గిరాకీ జోరందుకున్న నేపథ్యంలో, మారుతి సుజుకి తమ ఎమ్పివి సెగ్మెంట్ను బలపరచుకునేందుకు ఎర్టిగాలో కూడా ఏఎమ్టిని ఆఫర్ చేసే అవకాశాలున్నాయని సమాచారం.
అయితే, ఏఎమ్టి పెట్రోల్ ఇంజన్తో లభిస్తుందా లేక డీజిల్ ఇంజన్తో లభిస్తుందా లేక రెండింటిలోను లభిస్తుందా అనే విషయంపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. కాగా.. కొత్త ఎర్టిగాలో కొన్ని కాస్మోటిక్ అప్గ్రేడ్స్తోపాటుగా మెకానికల్ అప్గ్రేడ్స్ కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఇంజన్ స్టార్ట్/స్టాప్ బటన్తో మరిన్ని స్మార్ట్ ఫీచర్లు ఉంటాయని సమాచారం.

కాగా.. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న మారుతి ఎర్టిగా పెట్రోల్, డీజిల్, సిఎన్జి ఫ్యూయెల్ ఆప్షన్లలో లభిస్తోంది. పెట్రోల్ వెర్షన్లో అమర్చిన 1.4 లీటర్ కె14 వివిటిఐ పెట్రోల్ ఇంజన్ 6000 ఆర్పిఎమ్ వద్ద గరిష్టంగా 95 పిఎస్ (70 కి.వా.)ల శక్తిని, 4000 ఆర్పిఎమ్ వద్ద 130 ఎన్ఎమ్ల గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.
అలాగే, డీజిల్ వెర్షన్ ఎర్టిగాలో అమర్చిన 1.3 లీటర్ డిడిఐఎస్ సూపర్టర్బో విజిటి డీజిల్ ఇంజన్ 4000 ఆర్పిఎమ్ వద్ద గరిష్టంగా 90 పిఎస్ (66 కి.వా.)ల శక్తిని, 1750 ఆర్పిఎమ్ వద్ద 200 ఎన్ఎమ్ల గరిష్ట టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.
పెట్రోల్ వేరియంట్ ఎర్టిగా లీటరుకు 16 కి.మీ. మైలేజీని, డీజిల్ వేరియంట్ ఎర్టిగా లీటరుకు 20.77 కి.మీ. మైలేజీని మరియు సిఎన్జి వెర్షన్ ఎర్టిగా కేజీకి 22.08 కి.మీ. మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది. (అన్ని మైలేజ్లు ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం).


Click it and Unblock the Notifications








