తమిళనాడులో రాయల్ ఎన్ఫీల్డ్ 3వ ప్లాంట్
ఐషర్ గ్రూపుకు చెందిన ప్రముఖ మోటార్సైకిళ్ల తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ తమిళనాడులోని ఓరగడం తయారీ కేంద్రానికి సమీపంలో మరో ప్లాంట్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు చెన్నైకి సమీపంలోని వల్లం వడకల్ వద్ద సుమారు రూ.57 కోట్లు వెచ్చింది 50 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేసింది. ఇదే ప్రాంతంలో యమహా కూడా ఓ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తోంది.
రాయల్ ఎన్ఫీల్డ్కి ఇది తమిళనాడులో మూడవ ప్లాంట్ కానుంది. ఈ కొత్త ప్లాంట్ ప్రస్తుతం ఓరగడంలో ఉన్న ప్లాంట్ నుంచి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు కానుంది. ప్రస్తుతం రాయల్ ఎన్ఫీల్డ్కు ఓరగడంలో ఒక ప్లాంట్, తిరువొత్తియూర్లో మరో ప్లాంట్ ఉంది. ఈ రెండు ప్లాంట్ల నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ సాలీనా 3 లక్షల యూనిట్లను ఉత్పత్తి చేస్తుంది.

కాగా.. 2015 నాటికి ఈ ఉత్పత్తి సామర్థ్యాన్ని 4 లక్షల యూనిట్లకు, ఆ తర్వాత సంవత్సరంలో 6 లక్షల యూనిట్లకు పెంచాలని చూస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా తమ మోటార్సైకిళ్లకు పెరుగుతున్న డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని ఈ విస్తరణ చేస్తున్నామని ఐషర్ మోటార్స్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సిద్ధార్థ్ లాల్ తెలిపారు. ఈ ప్లాంట్ కోసం వెచ్చించనున్న పెట్టుబడి, ఉత్పత్తి సామర్థ్యం, ఉద్యోగవకాశాలు తదితర వివరాలను కంపెనీ త్వరలోనే వెల్లడి చేయనుంది.
రాయల్ ఎన్ఫీల్డ్ మోడళ్లకు ప్రస్తుతం మంచి డిమాండ్ ఉంది. ఈ బ్రాండ్ మోటార్సైకిళ్లను సొంతం చేసుకోవాలనుకునే కస్టమర్లు నెలల తరబడి వేచి ఉంటున్నారు. అయితే, ఈ కొత్త ప్లాంట్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే మాత్రం, వీటి వెయిటింగ్ పీరియడ్ భారీగా తగ్గే ఆస్కారం ఉంటుంది. ఉత్పత్తితో పాటుగా కంపెనీ తమ డీలర్ నెట్వర్క్ను కూడా విస్తరించుకోనుంది. 2015 నాటికి దేశవ్యాప్తంగా 500 అవుట్లెట్లను కలిగి ఉండాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.


Click it and Unblock the Notifications








