ధోని, కోహ్లీని చూడటానికి కూడా ఇంత జనం రాలేందు, ఇంతకీ ఎవరితను?
ప్రపంచంలో కెల్లా అత్యంత సాహసోపేతమైన, ప్రమాదకరమైన ర్యాలీల్లో ఒకటైన డకార్ ర్యాలీ (Dakar Rally) 2015 సీజన్లో మొట్టమొదటి సారిగా మన భారతీయుడు, బెంగుళూరుకి చెందిన 'సిఎస్ సంతోష్' (CS Santosh) పాల్గొని, 13 రోజుల పాటు జరిగిన ఈ ర్యాలీలో 9295 కిలోమీటర్ల దూరం వరకూ అలుపెరగకుండా ర్యాలీని విజయవంతంగా పూర్తి చేసి, స్వదేశానికి తిరిగొచ్చారు.
ఇప్పటి వరకూ ఎన్నో సీజన్ల డకార్ ర్యాలీ రేస్లు జరిగినప్పుడు, ఏ ఒక్క దానిలో కూడా భారతీయులు పాల్గొన లేకపోయారు. ఇలాంటి అత్యంత అరుదైన అవకాశం మన దేశానికి సిఎస్ సంతోష్కి దక్కింది. సంతోష్కి చిన్ననాటి నుంచే మోటార్సైకిళ్లంటే మక్కువ ఎక్కువ. ఆ మక్కువే అతడిని ఇంత దూరం తీసుకురాగలిగింది. ఒకానొక సమయంలో సంతోష్ ప్రాణాపాయ స్థితికి వెళ్లిన సంఘటన కూడా జరిగింది.
సంతోష్ సక్సెస్ స్టోరీకి సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలను తర్వాతి ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

సంతోష్ 2013లో దుబాయ్లో జరిగిన ఎఫ్ఐఎమ్ క్రాస్ కంట్రీ ర్యాలీ వరల్డ్ ఛాంపియన్షిప్లో భాగంగా అబుదాబి డిసెర్ట్ ఛాలెంజ్లో మూడవ రోజున అతని సుజుకి ఎమ్ఎక్స్450 జెడ్ మోటార్సైకిల్ ప్రమాదవశాత్తు అంటుకొని, అతని మెడ భాగం కాలిపోయింది (థర్డ్ డిగ్రీ బర్న్).

ఈ ప్రమాదం జరిగే సమయంలో అతను అప్పటికే 15వ స్థానంలో ఉండి, ఫినిషింగ్ లైన్కి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. ఇంధన ట్యాంక్ నుంచి పెట్రోల్ ఓవర్ఫ్లో కావటం, అది అప్పటికే వేడిగా ఉన్న బైక్ ఇంజన్పై అంటుకోవటంతో మంటలు చెలరేగాయి.

ఈ మంటల్లో అతని కాలికి ఉన్న రైడింగ్ గేర్ కాలిపోవటం, బైక్పై నుంచి క్రింద పడిపోవటంతో మెడ భాగం కాలిపోవటం జరిగింది. అయితే, అదృష్ట వశాత్తు అతని వెనుకగా వస్తున్న మరో కార్ డ్రైవర్ ఈ విషయాన్ని గుర్తించి, వెంటనే సంతోష్కి సాయం చేసి ఆస్పత్రికి తరలించారు.

ఇంతటి తీవ్రమైన ప్రమాదాన్ని ఎదుర్కున్నా సరే సంతోష్ మాత్రం తమ బైక్ రైడ్ ప్యాషన్ను వదులుకోలేదు. ప్రమాదం నుంచి కోలుకున్న కొద్ది రోజుల్లోనే తిరిగి తన బైక్ రైడ్ రేసింగ్లను ప్రారంభించాడు. ఇప్పుడు ఏ ఇండియన్ రేసర్ సాధించని ఘనతను సాధించాడు.

అత్యంత ప్రమాదకరమైన దారులతో కూడిన డకార్ ర్యాలీలో చివరి వరకూ అలసిపోకుండా, ఎలాంటి ప్రమాదాల బారిన పడకుండా గమ్యం చేరుకోవటం అనేది నిజంగా చాలా గొప్ప విషయం.

ఎటు వెళ్లలో తెలియని ఎడారులు, కొండలు, గుట్టలు, గడ్డకట్టిన ఉప్పు సరస్సుల మీదుగా ఈ డకార్ ర్యాలీ సాగుతుంది. ఇందులో పాల్గొని ప్రాణాల మీదకు తెచ్చుకున్నవాళ్లు కూడా ఎంతో మంది ఉన్నారు. కాళ్లు, చేతులు విరగ్గొట్టుకున్న వాళ్ల సంఖ్య అయితే, లెక్కలకి అందనిది.

ఈ 2015 డకార్ ర్యాలీ దక్షిణ అమెరికాలోని అర్జెంటీనా రాజధాని బ్యూనస్ఎయిర్స్ నుంచి ఈనెల 5వ తేదీన ప్రారంభమయింది. అర్జెంటీనా, చిలీ, బొలివియా దేశాల మీదుగా జరిగే ర్యాలీలో మార్గం చాలా క్లిష్టంగా వుంటుంది. ఈ రేసులో చివరి వరకూ వాహనం నడపటం అంటే కత్తి మీద సాము లాంటిదే. ఈ నెల 17న బ్యూనస్ఎయిర్స్లో ఈ ర్యాలీ ముగిసింది.

కాగా.. 2015 డకార్ ర్యాలీలో విజయవంతంగా గమ్యాన్ని చేరుకొని, తిరిగి స్వదేశానికి వచ్చిన సిఎస్ సంతోష్కి బెంగుళూరు ఎయిర్పోర్టులో ఘనస్వాగతం లభించింది. కుటుంబ సభ్యులు, అభిమానులు, మీడియా మిత్రుల కోలాహలంతో ఎయిర్పోర్టులో సందడి వాతావరణం నెలకొంది. సంతోష్కు స్వాగతం పలికేందుకు డ్రైవ్స్పార్క్ బృందం కూడా విమానాశ్రయానికి చేరుకుంది.


Click it and Unblock the Notifications








