మా కార్లలో మహీంద్రా ఇంజన్లు ఉండవ్; ఒప్పందం పూర్తిగా రద్దయింది: ఫోర్డ్
భారత మార్కెట్లో తన స్థిరత్వాన్ని పెంచుకునేందుకు అమెరికన్ కార్ బ్రాండ్ ఫోర్డ్, మనదేశంలోని ప్రముఖ యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రాతో చేతులు కలిపి జాయింట్ వెంచర్గా ఏర్పడాలని గడచిన 2019లో ఓ ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. అయితే, అనూహ్యంగా 2020లో కరోనా మహమ్మారి రావటంతో ఇరు కంపెనీలు ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు ఈ ఏడాది జనవరి (2021)లో ప్రకటించిన సంగతి తెలిసినదే.

ప్రస్తుతం, ఈ అగ్రిమెంట్ పూర్తిస్థాయిలో రద్దయినట్లుగా తెలుస్తోంది. ఇదివరకు ప్లాన్ చేసుకున్న దాని ప్రకారం, ఈ జాయింట్ వెంచర్ రద్దయినప్పటికీ, ఫోర్డ్ తమ వాహనాల్లో ఉపయోగించే ప్లాట్ఫామ్ను మరియు ఇంజన్లను మహీంద్రా నుండి పంచుకునే అవకాశం ఉండేది. అయితే, ఫోర్డ్ ఇండియా ఇప్పుడు దానికి కూడా సిద్ధంగా లేదు. అన్ని పనులు తామే స్వయంగా చేసుకుంటామని ఫోర్డ్ చెబుతోంది.

భారత మార్కెట్ కోసం ఫోర్డ్ కంపెనీ ప్లాన్ చేసిన ఎకో-స్పోర్ట్ ఫేస్లిఫ్ట్ మరియు ఓ మిడ్-సైజ్ ఎస్యూవీ కోసం మహీంద్రా ఇంజన్లను సరఫరా చేయాల్సి ఉంది. అయితే, ఫోర్డ్ తమ కార్లలో మహీంద్రా ఇంజన్లను ఉపయోగించేది లేదని, తామే స్వయంగా అభివృద్ధి చేసిన ఇంజన్లను ఉపయోగిస్తామని పేర్కొంది.

ఫోర్డ్ మహీంద్రాతో జాయింట్ వెంచర్ను పూర్తిగా ముగించిన తరువాత, భారతదేశంలో స్వతహాగా తమ కార్యకలాపాలను సాగించనుంది. దేశీయ మార్కెట్ కోసం ఫోర్డ్-మహీంద్రా జేవీ ప్లాన్ చేసిన BX44 మరియు BX772 లపై పనిచేయటాన్ని కూడా ఈ కంపెనీ నిలిపివేసినట్లుగా తెలుస్తోంది.

తాజా నివేదికల ప్రకారం, ఈ ప్రాజెక్టులలో ఫోర్డ్ తమ స్వంత టెక్నాలజీ మరియు ఇంజన్లనే ఉపయోగించనుంది. మహీంద్రా ఇంజన్లు కాకుండా ఫోర్డ్ తామే స్వంతంగా ఇంజన్లను తయారు చేసి, ఈ కొత్త మోడళ్లలో ఉపయోగించడం వలన ఫోర్డ్ ఇండియా రాబోయే ప్రాజెక్టులు షెడ్యూల్ ప్రకారం కాకుండా మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.

వాస్తవానికి, ఈ ఏడాది జూన్ నాటికి విడుదల కావల్సిన అప్గ్రేడెడ్ ఫోర్డ్ ఎకోస్పోర్ట్ ఎస్యూవీ ఫేస్లిఫ్ట్లో మహీంద్రా యొక్క 1.2 లీటర్ డైరెక్ట్-ఇంజెక్షన్ టర్బో-పెట్రోల్ ఇంజన్ను ఉపయోగించాల్సి ఉంది. ఈ ఒప్పందం రద్దు కావటంతో కొత్త ఎకోస్పోర్ట్లో ఇదివరకటి 1.5 లీటర్ పెట్రోల్ (డ్రాగన్) మరియు 1.5 డీజిల్ (డివి5) ఇంజన్లనే ఉపయోగించనున్నారు.

అదేవిధంగా, వచ్చే ఏడాది ఫోర్డ్ నుండి విడుదల కావల్సిన ఓ సి-ఎస్యూవీ (ఎక్స్యూవీ500 ప్లాట్ఫామ్ ఆధారంగా)లో మహీంద్రా యొక్క 2.0-లీటర్ పెట్రోల్ మరియు 2.2 డీజిల్ ఇంజన్లను ఉపయోగించాలని ప్లాన్ చేశారు. కానీ ఇప్పుడు ఆ ప్లాన్ కూడా రద్దయింది. ఫోర్డ్ ఇప్పుడు సి-ఎస్యూవీని చైనా మార్కెట్లో విక్రయిస్తున్న ఫోర్డ్ టెరిటరీ ప్లాట్ఫామ్ ఆధారంగా నిర్మించే అవకాశం ఉంది.

గడచిన 2017లో, మహీంద్రా మరియు ఫోర్డ్ కంపెనీలు టెక్నాలజీ భాగస్వామ్యంలోకి ప్రవేశించాయి. ఇందులో భాగంగా, ఉత్పత్తులు, ఇంజన్లు, కనెక్టివిటీ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వాహనాలు మరియు షేర్డ్ సర్వీసులు ఉన్నాయి. కాలక్రమేణా, ఈ ఐదు ప్రాజెక్టులలో రెండు తొలగించబడ్డాయి. గత జనవరి 2021లో జాయింట్ వెంచర్ ఒప్పందం ముగిసిన తరువాత ఇతర ప్రాజెక్టులు కూడా పూర్తిగా మూసివేయబడ్డాయి.

ఫోర్డ్ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం, కోవిడ్-19 మహమ్మారి తరువాత ఆర్థిక మరియు వ్యాపార పరిస్థితుల్లో వచ్చిన మార్పుల కారణంగానే ఈ జాయింట్ వెంచర్ను రద్దు చేసుకుంటున్నట్లు గతంలో వెల్లడించింది.
ఇదిలా ఉంటే, ఫోర్డ్ ఇటీవలే ఎలక్ట్రానిక్ పరికరాల తయారీదారైన హెచ్పి సంస్థతో ఓ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఇందులో భాగంగా, హెచ్పి టెక్నాలజీ సాయంతో ఫోర్డ్ వ్యర్థాలు మరియు మిగిలిపోయిన ముడి పదార్థాలను ఉపయోగించి 3డి ప్రింటింగ్ టెక్నాలజీ ద్వారా కార్ల కోసం పరికరాలు మరియు భాగాలను తయారు చేస్తుంది.

ఇంజెక్షన్ మోల్డింగ్ టెక్నాలజీతో తయారు చేసిన ఆటో భాగాలు పర్యావరణ అనుకూలమైనవని ఫోర్డ్ చెబుతోంది. అంతేకాకుండా, ఇలా 3డి ప్రింటింగ్ ద్వారా ప్రింట్ చేయబడిన వాహనాలు 7 శాతం తేలికైనవి మరియు సాధారణ భాగాల కంటే 10 శాతం తక్కువ ధరను కలిగి ఉంటాయని కంపెనీ పేర్కొంది. అలాగని ఇవి నాణ్యత మరియు దృఢత్వం విషయంలో రాజీ పడవని కూడా కంపెనీ తెలిపింది.


Click it and Unblock the Notifications








