Attero సహకారంతో తొలి ఈవీ బ్యాటరీని విజయంవంతంగా రీసైకిల్ చేసిన MG Motor
చైనీస్ యాజమాన్యంలో ఉన్న ప్రముఖ బ్రీటీష్ కార్ బ్రాండ్ ఎమ్జి మోటార్ (MG Motor) ఈ ఏడాది ప్రారంభంలో, భారతదేశపు అతిపెద్ద ఎలక్ట్రానిక్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ మరియు క్లీన్-టెక్ ప్రొవైడర్ అయిన అట్రో (Attero) తో తన భాగస్వామ్యాన్ని ప్రకటించిన సంగతి తెలిసినదే. ఈ భాగస్వామ్యంలో భాగంగా, ఎమ్జి మోటార్ ఎలక్ట్రిక్ కార్లలో ఉపయోగించిన లిథియం-అయాన్ బ్యాటరీలను, వాటి జీవితకాలం పూర్తయిన తర్వాత తిరిగి వాటిని మరోసారి ఉపయోగించేలా రీసైకిల్ చేయడంలో అట్రో సహకరిస్తుంది.

కాగా, తాజా నివేదిక ప్రకారం, ఎమ్జి మోటార్ ఇండియా ఈ-వేస్ట్ మేనేజ్మెంట్ సొల్యూషన్ ప్రొవైడర్ అయిన అట్రోతో కలిసి తన మొదటి ఎలక్ట్రిక్ వాహన బ్యాటరీని విజయవంతంగా రీసైకిల్ చేసింది. రీసైక్లింగ్ ప్రక్రియ నుండి కొత్త బ్యాటరీలను అభివృద్ధి చేయడానికి అవసరమైన లోహాలు మరియు ఇతర భాగాలు ఉపయోగించనున్నారు. ప్రకృతి సాన్నిహిత్యమైన మరియు స్థిరమైన ఈవీ ఆర్థిక వ్యవస్థను సృష్టించే ప్రయత్నంలో భాగంగా, ఎమ్జి మోటార్ ఇండియా తన జెడ్ఎస్ ఈవీ మోడల్ కోసం లిథియం అయాన్ బ్యాటరీలను తిరిగి ఉపయోగించేందుకు Atero సహకరిస్తుందని కంపెనీ పేర్కొంది.

దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ మరియు క్లీన్-టెక్ ప్రొవైడర్ అయిన Atero, భారతదేశంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలు పేరుకుపోకుండా, వాటిని తిరిగి వాడుకునేందుకు వీలుగా రీసైకిల్ ప్రక్రియను నిర్వహిస్తోంది. ఈ విధానంలో అట్రో పాత బ్యాటరీలను కూడా రీసైకిల్ చేస్తుంది. ఇందులో భాగంగానే, ఎమ్జి మోటార్ తమ తొలి కారు బ్యాటరీ ప్యాక్ ని విజయవంతంగా రీసైకిల్ చేసింది. ఈ విజయంతో, ఎమ్జి మోటార్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి తన కార్యక్రమాలను మరింత విస్తరించిందని చెప్పొచ్చు.

ఎలక్ట్రిక్ వాహనాల ఎండ్-టు-ఎండ్ సస్టైనబిలిటీని నిర్ధారించడంలో తమ కంపెనీ కట్టుబడి ఉందని ఎమ్జి మోటార్ ఇండియా ప్రెసిడెంట్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ చాబా అన్నారు. బ్యాటరీ వ్యర్థాలు స్థిరమైన చలనశీలతకు (సస్టైనబల్ మొబిలిటీకి) సవాలుగా ఉన్నందున బ్యాటరీ రీసైక్లింగ్ ను తాము గాఢంగా విశ్వసిస్తున్నామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా అట్రో రీసైక్లింగ్ సీఈఓ మరియు సహ వ్యవస్థాపకుడు నితిన్ గుప్తా మాట్లాడుతూ, దేశంలో ఈవీ వాహనాల స్వీకరణ వేగం పెరిగేకొద్దీ, ఇ-వ్యర్థాల నిర్వహణకు స్థిరమైన విధానం భారతదేశానికి ఎంతో కీలకమైనదని అన్నారు.

ఈ విషయంలో ఎమ్జి మోటార్ ఇండియాతో చేతులు కలపడం చాలా సంతోషంగా ఉందని, ఈ రకమైన పర్యావరణ వ్యవస్థలను బలోపేతం చేయడానికి మరియు పరిశ్రమ అంతటా ఒక ఉదాహరణగా నిలిచేందుకు తమ భాగస్వామ్యం దోహదపడుతుందని ఆయన అభిప్రాయ పడ్డారు. కాలం చెల్లిపోయిన లేదా పనిచేయని లిథియం-అయాన్ బ్యాటరీల నుండి దాదాపు 99 శాతం లోహాలను వెలికితీసే సాంకేతికతను అట్రో కలిగి ఉంది. అదనంగా, ఈ ప్రక్రియల ద్వారా వారు భారతదేశంలో రాగి, లిథియం మరియు కోబాల్ట్ వంటి విలువైన లోహాల కొరత ఏర్పడకుండా ఉండేలా చూస్తారు.

ఎమ్జి మోటార్ ఇండియా ఇటీవల గుజరాత్ లోని హలోల్ ఉన్న కంపెనీ తయారీ కేంద్రానికి స్థిరమైన మరియు స్వచ్ఛమైన శక్తిని అభివృద్ధి చేయడానికి 4.85 MW విండ్-సోలార్ హైబ్రిడ్ పవర్ సెటప్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ ప్లాంట్ కోసం క్లీన్మాక్స్తో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంటున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ భాగస్వామ్యంతో, ఎమ్జి మోటార్ ఇండియా రాబోయే 15 సంవత్సరాలలో 2 లక్షల మెట్రిక్ టన్నుల CO2ను తగ్గిస్తుందని, ఇది సుమారు 13 లక్షల కంటే ఎక్కువ చెట్లను నాటడంతో సమానమని కంపెనీ తెలిపింది.

MG ZS EV ఎలక్ట్రిక్ కారు గురించి క్లుప్తంగా..
ఎమ్జి మోటార్ ఇండియా ప్రస్తుతం భారత మార్కెట్లో ఒకే ఒక ఎలక్ట్రిక్ కారును విక్రయిస్తోంది. ఎమ్జి జెడ్ఎస్ ఈవీ (MG ZS EV) పేరుతో లభిస్తున్న ఈ ఎలక్ట్రిక్ కారు రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో మొదటిది ఎక్సైట్ అనే బేస్ వేరియంట్ మరియు దాని ధర రూ.20.99 లక్షలుగా ఉంది. కాగా, రెండవది ఎక్స్క్లూజివ్ అనే టాప్-ఎండ్ వేరియంట్ మరియు దీని ధర రూ.24.18 లక్షలు (రెండు ధరలు, ఎక్స్-షోరూమ్)గా ఉంది. కంపెనీ సర్టిఫై చేసినదాని ప్రకారం, ఎమ్జి జెడ్ఎస్ ఈవీ ఎలక్ట్రిక్ ఎస్యూవీ పూర్తి చార్జ్పై గరిష్టంగా 419 కిమీ రేంజ్ను ఆఫర్ చేస్తుంది.

ఇక దీని పవర్ట్రైన్ విషయానికి వస్తే, ఎమ్జి జెడ్ఎస్ ఎలక్ట్రిక్ కారులో ఉపయోగించిన ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 141 బిహెచ్పి శక్తిని మరియు 353 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కారులో అమర్చిన 44.5 కిలో వాట్ అవర్ బ్యాటరీ ప్యాక్తో పనిచేస్తుంది. పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఇది కేవలం 8.5 సెకన్లలోనే గంటకు 0 - 100 కిమీ వేగాన్ని చేరుకోగలదు. ఈ కారు మూడు డ్రైవింగ్ మోడ్లతో పాటుగా రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది. ఈ టెక్నాలజీ వలన బ్రేక్ నొక్కిన ప్రతిసారి, ఆ శక్తి తిరిగి బ్యాటరీని చార్జ్ చేయడానికి సహకరిస్తుంది.


Click it and Unblock the Notifications








