కొత్త థార్ కోసం క్యూ కడుతున్న కస్టమర్స్, పెరుగుతున్న వెయిటింగ్ పీరియడ్
గడచిన సంవత్సరం చివర్లో భారత మార్కెట్లో విడుదలైన కొత్త తరం మహీంద్రా థార్, బుకింగ్స్ పరంగా దూసుకుపోతోంది. ఈ మోడల్ కోసం వెయిటింగ్ పీరియడ్ అధికంగా ఉన్నప్పటికీ, కస్టమర్లు మాత్రం దీనిని సొంతం చేసుకునేందుకు బారులు తీరుతున్నారు.

కొత్త 2020 మహీంద్రా థార్ను మార్కెట్లో ప్రారంభించినప్పటి నుండి ఇప్పటి వరకూ 39,000 యూనిట్లకు పైగా బుకింగ్లు వచ్చినట్లు కంపెనీ పేర్కొంది. మహీంద్రా తమ సరికొత్త థార్ ఎస్యూవీని అక్టోబర్ 2, 2020వ తేదీన మార్కెట్లో విడుదల చేసింది. ప్రస్తుతం ఈ మోడల్ కోసం వేరియంట్ను బట్టి 5 నుండి 8 నెలల వరకూ వెయిటింగ్ పీరియడ్ ఉన్నట్లు సమాచారం.

ప్రస్తుతం మార్కెట్లో మహీంద్రా థార్ ఏఎక్స్ మరియు ఎల్ఎక్స్ అనే రెండు వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది. ఈ రెండు వేరియంట్లు పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లలో లభిస్తున్నాయి. ఈ ఎస్యూవీలో ఫిక్స్డ్ హార్ట్ టాప్, సాఫ్ట్ టాప్ మరియు కన్వర్టిబుల్ టాప్ అనే మూడు రకాల రూఫ్ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

మహీంద్రా థార్ కోసం దేశవ్యాప్తంగా రోజుకు సుమారు 250 నుండి 300 యూనిట్ల వరకూ బుకింగ్స్ వస్తున్నట్లు సమాచారం. దీన్నిబట్టే అర్థమవుతుంది, ఈ మోడల్ పట్ల కస్టమర్లలో ఉన్న క్రేజ్ ఏంటో. ప్రస్తుతం మార్కెట్లో మహీంద్రా థార్ ప్రారంభ ధర రూ.12.10 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

కొత్త 2020 మహీంద్రా థార్ పెట్రోల్ మరియు డీజిల్ రెండు ఇంజన్ ఆప్షన్లలో ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో కొత్త థార్ కోసం వస్తున్న బుకింగ్స్లో ఎక్కువ శాతం ఆటోమేటిక్ వేరియంట్లే ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా, టాప్ ఆప్షన్లలో కస్టమర్లు ఎక్కువగా కన్వర్టిబల్ టాప్కే ప్రాధాన్యత ఇస్తున్నట్లు మహీంద్రా తెలిపింది.

ప్రస్తుతం ఆటోమొబైల్ పరిశ్రమను వేధిస్తున్న సెమీ కండక్టర్స్ చిప్స్ కొరత కూడా మహీంద్రా థార్ వెయిటింగ్ పీరియడ్ గణనీయంగా పెరగటానికి కారణంగా చెప్పుకోవచ్చు. మహీంద్రా ఇటీవల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ లేకుండా తయారీ చేసిన థార్ ఎస్యూవీలను తమ డీలర్షిప్లకు కేంద్రాలకు పంపిణీ చేసింది. విడిభాగాల సరఫరా తిరిగి ప్రారంభం కాగానే, డీలర్ స్థాయిలో ఇందులో ఇన్ఫోటైన్మెంట్ను ఫిక్స్ చేస్తారు.

సరికొత్త మహీంద్రా థార్లో కంపెనీ కొత్తగా అభివృద్ధి చేసిన 2.0 లీటర్ టి-జిడిఐ ఎమ్స్టాలియన్ పెట్రోల్ ఇంజన్ మరియు 2.2 లీటర్ ఎమ్హాక్ డీజిల్ ఇంజన్లను ఉపయోగించారు. ఇందులో పెట్రోల్ ఇంజన్ 150 బిహెచ్పి పవర్ మరియు 320 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే, డీజిల్ ఇంజన్ 130 బిహెచ్పి పవర్ మరియు 300 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.

ఈ రెండు ఇంజన్లు కూడా కొత్త 6-స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్తో కానీ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్బాక్స్ ఆప్షన్తో కానీ లభిస్తాయి. ఈ ఎస్యూవీలో షిఫ్ట్-ఆన్-ఫ్లై ఫోర్-వీల్-డ్రైవ్ సిస్టమ్తో పాటుగా మెకానికల్ లాకింగ్ డిఫరెన్షియల్స్ను స్టాండర్డ్గా ఆఫర్ చేస్తున్నారు.

ఇటీవల గ్లోబల్ ఎన్క్యాప్ నిర్వహించిన క్రాష్ టెస్టులో కొత్త మహీంద్రా థార్ 4-స్టీర్ సేఫ్టీ రేటింగ్ను దక్కించుకుంది. వయోజనుల సేఫ్టీ విషయంలో ఇది 17 పాయింట్లకు గాను 12.52 పాయింట్లు సాధించగా, పిల్లల సేఫ్టీ విషయంలో 49 పాయింట్లకు గాను 41.11 పాయింట్ల స్కోరును సాధించింది.

మహీంద్రా థార్ ఎస్యూవీ 226 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ మరియు 650 మిమీ వాటర్ వాడింగ్ లక్షణాలతో మంచి ఆఫ్-రోడ్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది. ఈ కారులో రూఫ్ టాప్ స్పీకర్ మరియు టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డ్యూయెల్ ఎయిర్బ్యాగులు, ఏబిఎస్, రియర్ పార్కింగ్ అసిస్ట్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.


Click it and Unblock the Notifications








