కరోనా ఎఫెక్ట్: షోరూమ్లన్నీ వర్చువల్గా మారిపోతున్నాయ్.. టొయోటా కూడా..
కరోనా వైరస్ వ్యాప్తి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా అనేక కొత్త డిజిటల్ మార్పులు పుట్టుకొస్తున్నాయి. స్కూళ్లన్నీ ఆన్లైన్గా మారిపోయాయి, వైద్య సలహాలు కూడా ఆన్లైన్లోనే ఇస్తున్నారు. ఇలా అనేక సేవలు డిజిటలైజ్ అయ్యాయి. ఇప్పుడు కార్ షోరూమ్లు కూడా పూర్తిగా డిజిటల్గా మారుతున్నాయి.

తాజాగా, జపనీస్ కార్ బ్రాండ్ టొయోటా తమ వెబ్సైట్లో ఓ వర్చువల్ షోరూమ్ని ప్రారంభించింది. ఈ వర్చువల్ షోరూమ్ సహాయంతో కస్టమర్లు ఇప్పుడు ఎక్కడి నుండైనా టొయోటా కార్లను కొనుగోలు చేయవచ్చు. అంతేకాదు, ఈ వర్చువల్ షోరూమ్లో ఫైనాన్స్ ఆఫర్లు మరియు రుణాలకు సంబంధించిన వివరాలను వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి.

ఈ టొయోటా వర్చువల్ షోరూమ్ను ఆస్వాదించడానికి, కస్టమర్లు టొయోటా భారత్ వెబ్సైట్ను సందర్శించాలి. సదరు వెబ్సైట్ మెనూలో ఉన్న వర్చువల్ షోరూమ్ ట్యాబ్పై క్లిక్ చేయటం ద్వారా కస్టమర్లు ఈ షోరూమ్లోకి ప్రవేశించవచ్చు. కంపెనీ ఈ వర్చువల్ షోరూమ్లో, తమ పాపులర్ మోడళ్లన్నింటినీ ప్రదర్శిస్తుంది.

కస్టమర్లు తమ కంప్యూటర్లో మౌస్ సాయంతో స్క్రీన్ను కుడికి లేదా ఎడమకు స్వైప్ ద్వారా ఈ వర్చువల్ షోరూమ్ యొక్క 360 డిగ్రీ వీక్షణను పొందవచ్చు. అంతేకాకుండా, తమకు నచ్చిన కారుపై క్లిక్ చేసి, సదరు కారు యొక్క ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ల 360 డిగ్రీ వీక్షణను కూడా చూడొచ్చు. దీని సాయంతో కారులోని ప్రతి చిన్న వివరాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు.

ఈ వర్చువల్ షోరూమ్లో ప్రదర్శించబడే కారు యొక్క ఎక్స్-షోరూమ్ ధరను మరియు సదరు కారులో ఉండే ప్రధాన ఫీచర్ల గురించి కంపెనీ హైలైట్ చేసింది. ఈ వర్చువల్ షోరూమ్ నిజమైన షోరూమ్లోని అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ తెలిపింది. అయితే, కారును భౌతికంగా నడిపి చూడాలనుకునే వారి కోసం కంపెనీ టెస్ట్ డ్రైవ్ బుకింగ్ ఆప్షన్ను కూడా అందిస్తుంది.

టెస్ట్ డ్రైవ్ కోసం బుక్ చేసుకున్న కస్టమర్ల అభ్యర్థనను వారికి సమీపంలో ఉండే టొయోటా డీలర్షిప్ కేంద్రానికి పంపించబడుతుంది. ఆ తర్వాత, సంబంధిత డీలర్షిప్ సదరు కస్టమర్ని సంప్రదించి టెస్ట్ డ్రైవ్ సదుపాయాన్ని కల్పిస్తుంది. ఆసక్తిగల కస్టమర్లు తమకు నచ్చిన టొయోటా కార్లను ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు లేదా కొనుగోలు చేయవచ్చు.

కార్ల ధరలను పెంచిన టొయోటా:
టొయోటా కిర్లోస్కర్ మోటార్ ఇటీవల తమ పోర్ట్ఫోలియోలో ఎంపిక చేసిన మోడళ్ల ధరలను పెంచింది. ఇందులో ప్రధానంగా, టొయోటా నుండి అత్యంత పాపులర్ అయిన ఇన్నోవా క్రిస్టా ధరలను కంపెనీ పెచింది. ఉత్పత్తి వ్యయం పెరగడం వల్లనే ఈ ఎమ్పివి ధరలను పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. పెరిగిన ధరలు ఆగస్టు 1వ తేదీ నుండే అమల్లోకి రానున్నాయి.

టొయోటా ఇన్నోవా క్రిస్టా ప్రస్తుతం భారతదేశంలో 18 వేరియంట్లలో విక్రయించబడుతోంది. మార్కెట్లో ఈ ఫ్లాగ్షిప్ ఎమ్పివి యొక్క బేస్ వేరియంట్ అయిన 2.7-లీటర్ జిఎక్స్ 7-సీటర్ పెట్రోల్ ధర రూ.16.52 లక్షలు కాగా, ఇందులో టాప్-ఎండ్ అయిన 2.4-లీటర్ డీజిల్ జెడ్ఎక్స్ 7-సీటర్ ఆటోమేటిక్ ధర రూ.24.59 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉన్నాయి.

ఇంటి వద్దకే టొయోటా స్పేర్ పార్ట్స్:
కరోనావైరస్ నేపథ్యంలో, తమ కస్టమర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విడిభాగాలను నేరుగా వారి ఇంటికే పంపిణీ చేసేలా టొయోటా చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా, టొయోటా తమ అధీకృత జెన్యూన్ స్పేర్ పార్ట్స్ను కస్టమర్ల ఇంటి వద్దకే చేర్చేలా డోర్ స్టెప్ డెలివరీ సేవలను ప్రారంభించింది.

ఈ సదుపాయం ద్వారా టొయోటా కిర్లోస్కర్ కస్టమర్లు నేరుగా తమ ఇంటి వద్దకే అసలైన విడి భాగాలను పొందవచ్చు. 'టయోటా పార్ట్స్ కనెక్ట్'లో భాగంగా, కంపెనీ ఇప్పుడు జెన్యూన్ విడిభాగాలను కొనుగోలు చేయాలనుకునే వినియోగదారులకు'డోర్ డెలివరీ' ఆప్షన్ను అందిస్తోంది. ఆసక్తిగల కస్టమర్లు టొయోటా కిర్లోస్కర్ డీలర్షిప్ నుండి కూడా అవసరమైన విడి భాగాలను పొందవచ్చు.

టొయోటా డెలివరీ చేస్తున్న విడిభాగాలలో కార్ కేర్ ఎసెన్షియల్స్, ఇంజన్ ఆయిల్, టైర్లు మరియు బ్యాటరీలతో సహా అనేక రకాల టొయోటా జెన్యూన్ ఉత్పత్తులు ఉన్నాయి. ప్రస్తుతం ఈ 'డోర్ డెలివరీ' సేవలు దేశంలోని 12 నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కాగా, 2021 చివరి నాటికి ఈ సేవలను దేశంలోని అన్ని నగరాలకు విస్తరించాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది.వాహన కొనుగోలు దారులకు ఈ వర్చువల్ విధానం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఒక రకంగా కరోనా వ్యాప్తిని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది.


Click it and Unblock the Notifications








