తెలంగాణలో భారీ పెట్టుబడికి శ్రీకారం చుట్టిన ట్రైటాన్ ఈవీ; పూర్తి వివరాలు
ప్రపంచవ్యాప్తంగా ఉన్న రోజుకి శరవేగంగా అభివృద్ది చెందుతున్న ఈవీ రంగంలో దిగ్గజ కంపెనీలకు సైతం పోటీ ఇస్తున్న ప్రముఖ కంపెనీలలో ఒకటి ట్రైటాన్ ఈవీ (Triton EV). ఈ కంపెనీ ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణాలో ఏకంగా 2,100 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టడానికి ముందుకు వచ్చింది.

ట్రైటాన్ ఈవీ కంపెనీ ప్రతినిధులు గత వారంలో తెలంగాణ ప్రగతి భవన్ లో జరిగిన సమావేశంలో పరిశ్రమల శాఖ మంత్రి కె.టి.ఆర్ తో సమావేశమై తమ పెట్టుబడి ప్రణాళికలను గురించి పూర్తిగా వివరించారు. ఎలక్ట్రిక్ రంగం రానురాను భవిష్యత్తులో మంచి డిమాండ్ ని పొందుతుందని, దీని కోసం తమ కంపెనీ పెద్ద ఎత్తున విస్తరించేందుకు ఇప్పటికే ప్రణాళికలతో సిద్ధంగా ఉందని మంత్రి కేటీఆర్ కు ట్రైటాన్ కంపెనీ 'సీఈఓ హిమాన్షు' పటేల్ తెలిపారు.

ట్రైటాన్ కంపెనీ భారతదేశంలో తమ తయారీ ప్లాంట్ ని ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉందని, దీనికోసం ఇప్పటికే వివిధ రాష్ట్రాలను పరిశీలించి, దీనికి తెలంగాణ చాలా అనుకూలంగా ఉంటుందని నిర్ణయించిన తర్వాత తమ కార్యాలకలాపాలను ముందుకు తీసుకుపోయేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది.

తెలంగాణ రాష్ట్రంలోని జహీరాబాద్లోని నేషనల్ ఇన్వెస్ట్మెంట్ & మాన్యుఫ్యాక్చరింగ్ జోన్ వద్ద తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ యూనిట్ ఏర్పాటైతే ఇక్కడ దాదాపు 25 వేల మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి.

కంపెనీ ప్రణాళిక ప్రకారం మొదటి 5 సంవత్సరాల్లో 50 వేల వాహనాలు ఉత్పత్తి చేసేందుకు ఒక ప్రణాళికను రూపొందిస్తోంది. కంపెనీ పేర్కొన్న ప్రణాళిక ప్రకారం తొలి ఐదు సంవత్సరాల్లో 50 వేలకు పైగా, సెడాన్లు, లగ్జరీ కార్లు, ఇతర ఎలక్ర్టిక్ వాహానాలను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది.

ఈ ఒప్పందంపై కంపెనీ డివిజన్ డెవలప్మెంట్ హెడ్ ఎం.మన్సూర్, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ సంతకం చేశారు. ఈ అవగాహన ఒప్పందం ద్వారా తెహంగాణ రాష్ట్ర ప్రభుత్వం జహీరాబాద్లోని నిమ్జ్లోని తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా కంపెనీకి అవసరమైన భూమిని అందిస్తుంది.

ఈ మెగా ప్రాజెక్ట్కు కావాల్సిన అన్ని సదుపాయాలను మరియు సహకారాన్ని ప్రభుత్వం తరఫున అందిస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం క్రమంగా ఈవీ రంగ పెట్టుబడులకు ఒక అనుకూలమైన ప్రదేశంగా మారుతోంది, కావున భవిష్యత్ లో అనేక కంపెనీలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తాయనే ఆశాభావాన్ని మంత్రి కేటీఆర్ వ్యక్తం చేశారు.

గత ఏడాది 2020 ఏప్రిల్ నెలలో, కంపెనీ ఒకే చార్జిపై 1,126 కిలోమీటర్ల పరిధి అందించగల హెచ్ఎస్యువిని ఆవిష్కరించింది. ఇందులో 200 kWh బ్యాటరీ అమర్చబడి ఉంటుంది. ఇది ప్రతి చక్రంలో ఉంచిన నాలుగు మోటారులకు శక్తిని సరఫరా చేస్తుంది.

ఈ నాలుగు ఎలక్ట్రిక్ మోటార్లు 1480 బిహెచ్పి శక్తిని అందిస్తాయి. ఇది కేవలం 2.9 సెకన్లలో 0 నుండి 100 కిలోమీటర్ల వేగంతో చేరుకోగల ఈ ఎలక్ట్రిక్ ఎస్యూవీ కోసం ట్రైటాన్ ఇప్పటికే బుకింగ్లను స్వీకరించడం ప్రారంభించింది.


Click it and Unblock the Notifications








