గుడ్న్యూస్.. డిసెంబర్ 31 వరకూ వాహన డాక్యుమెంట్స్ వ్యాలిడిటీ పొడగింపు
భారత రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (ఎమ్ఓఆర్టిహెచ్) మోటారిస్టులకు ఓ తీపికబురు వెల్లడించింది. వచ్చే డిసెంబర్ 31, 2020 వరకు వాహన పత్రాల చెల్లుబాటును పొడిగిస్తున్నట్లు ఎమ్ఓఆర్టిహెచ్ ప్రకటించింది. దేశంలో కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన అంతరాయం కారణంగా గడువు ముగిసిన వాహన పత్రాల చెల్లుబాటు కాలాన్ని మరింత పొడిగించాలని ఎమ్ఓఆర్టిహెచ్ నిర్ణయించింది.

ఈ వాహన పత్రాల జాబితాలో డ్రైవింగ్ లైసెన్స్, పర్మిట్లు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు మరియు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లతో పాటుగా మోటారు వాహనాల చట్టం 1988 మరియు సెంట్రల్ మోటార్ వెహికల్ రూల్స్ 1989 కిందకు వచ్చే అన్ని పత్రాలు ఉంటాయి.

కోవిడ్-19 నేపథ్యంలో, దేశంలో వాహన పత్రాల చెల్లుబాటు ఇప్పటికే రెండుసార్లు పొడిగించడం జరిగింది. తాజాగా దేశంలో వెహికల్ డాక్యుమెంట్స్ వ్యాలిడిటీని పొడగించడం ఇది మూడవసారి. ఎమ్ఓఆర్టిహెచ్ గతంలో ఈ పత్రాల వ్యాలిడిటీని మొదట జూన్ వరకు పొడగించింది, ఆ తర్వాత సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. ఇప్పుడు మూడవసారి డిసెంబర్ 31 వరకూ పొడగించింది.

ఎమ్ఓఆర్టిహెచ్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని ధృవీకరించింది. "దేశవ్యాప్తంగా కోవిడ్-19 వ్యాప్తి చెందకుండా ఉండటానికి ఫిట్నెస్, పర్మిట్లు, లైసెన్సులు, రిజిస్ట్రేషన్ లేదా ఇతర పత్రాల చెల్లుబాటును డిసెంబర్ 31, 2020 వరకు పొడిగించాలని ఎమ్ఓఆర్టిహెచ్ నిర్ణయించింది" అని ట్విట్టర్ పేర్కొంది.

భారత రోడ్డు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ (ఎమ్ఓఆర్టిహెచ్) కూడా ఒక అధికారిక ప్రకటనను విడుదల చేసింది. దీని ప్రకారం, ఫిబ్రవరి 1, 2020వ తేదీ నాటికి గడువు ముగిసే లేదా ముగిసిన అన్ని వాహన పత్రాలు డిసెంబర్ 31, 2020 వరకు చెల్లుబాటు అయ్యేవిగా పరిగణించబడుతుందని ప్రకటించింది.

దేశంలో కొనసాగుతున్న కోవిడ్-19 మహమ్మారి కారణంగా లాక్డౌన్ సమయంలో వాహన పత్రాల చెల్లుబాటు లేదా పొడిగింపును మంజూరు చేయలేకపోవడమే ఈ పత్రాల పొడిగింపుకు కారణమని ఎమ్ఓఆర్టిహెచ్ తమ ప్రకటనలో పేర్కొంది. ఈ పత్రాలను సంవత్సరం చివరి వరకు చెల్లుబాటు అయ్యేలా చూడాలని అన్ని విభాగాల అధికారులకు సూచించింది.

దేశంలో వాహన పత్రాల చెల్లుబాటు పొడగింపుపై డ్రైవ్స్పార్క్ అభిప్రాయం.
ప్రస్తుత క్లిష్ట సమయంలో దేశంలో వాహన పత్రాల చెల్లుబాటును పొడిగించడం నిజంగా స్వాగతించే విషయమే. అనేక రాష్ట్రాల్లో లాక్డౌన్ పూర్తిగా తొలగించినప్పటికీ, రోడ్లపై వ్యక్తిగత మరియు వాణిజ్య వాహనాల సంచారం పూర్తిగా పునరిద్దరించబడలేదు. ఈ నేపథ్యంలో, వాహనాదారులపై అదనపు భారం పడకుండా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం హర్షించదగినదిగా చెప్పుకోవచ్చు.


Click it and Unblock the Notifications








