కోవిడ్-19 మొబైల్ టెస్టింగ్ యూనిట్గా మారిన ఎమ్జి హెక్టర్ ప్లస్ ఎస్యూవీ
కరోనా మహమ్మారితో పోరాడుతున్న భారతదేశానికి తమ వంతు సాయం అందించేందుకు చైనీస్ కార్ బ్రాండ్ ఎమ్జి మోటార్, తమ సహకారాన్ని కొనసాగిస్తూనే ఉంది. వైద్య ఆక్సిజన్ ఉత్పత్తి, అంబులెన్సుల సరఫరా మరియు కోవిడ్ రోగుల కోసం వైద్య వసతులను కల్పిస్తున్న ఎమ్జి మోటార్ ఇండియా, తాజాగా కోవిడ్-19 మొబైల్ టెస్టింగ్ యూనిట్ను డొనేట్ చేసింది.

గుజరాత్ రాష్ట్రంలో ఎమ్జి మోటార్ తమ హెక్టర్ ప్లస్ కోవిడ్-19 మొబైల్ టెస్టింగ్ యూనిట్ను ఉపయోగిస్తోంది. నేరుగా కోవిడ్ రోగుల వద్దకే చేరుకుని ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించేలా ఈ వాహనాన్ని డిజైన్ చేశారు. వైద్య అధికారులు ఈ కారులో ప్రయాణించి, ప్రజల నుండి నమూనాలను సేకరిస్తారు.

ఈ విషయం గురించి ఎమ్జి మోటార్ ఇండియా చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ సాబా మాట్లాడుతూ, మన దేశం ఈ అంటువ్యాధి నుండి కోలుకోవడానికి, మొబైల్ వైద్య సేవలు ప్రస్తుతం ఎంతో అవసరం అని, ఇందులో భాగంగా ఎమ్జి సంస్థ తరఫున తాము చేయగలిగినంత సహాయం చేస్తున్నామని చెప్పారు.

ఈ ప్రయత్నంలో భాగంగానే, తాము మొదటి హెక్టర్ ప్లస్ మొబైల్ టెస్టింగ్ యూనిట్ను విరాళంగా ఇచ్చినట్లు ఆయన తెలిపారు. గత సంవత్సరం కరోనా వైరస్ యొక్క మొదటి వేవ్ సంభవించినప్పుడు కూడా ఎమ్జి మోటార్ ఇండియా వివిధ రకాల సహాయ కార్యక్రమాలను నిర్వహించింది.

గడచిన మార్చి నెలలో ఎమ్జి మోటార్ ఇండియాకు చెందిన నాగ్పూర్ ఎమ్జి డీలర్లు ఐదు రెట్రోఫిట్ హెక్టర్ అంబులెన్స్లను నాగ్పూర్లోని నంగియా స్పెషాలిటీ ఆసుపత్రికి పంపిణీ విరాళంగా అందించారు. ప్రత్యేకంగా రూపొందించిన ఈ ఎమ్జి హెక్టర్ అంబులెన్స్లలో అత్యవసర సమయంలో ప్రాణాలను రక్షించే వైద్య పరికరాలు ఉన్నాయి.

ఇందులో ఆటో లోడింగ్ స్ట్రెచర్, సిలిండర్ ఆక్సిజన్ సప్లై సిస్టమ్, ఫైవ్ పారామీటర్ మానిటర్తో డ్రగ్ క్యాబినెట్, ఫైర్ ఎక్స్టూయిషర్తో ఎక్స్టీరియర్ లైట్ బార్, సైరన్, యాంప్లిఫైయర్, బ్యాటరీ మరియు సాకెట్ ఇన్వర్టర్ వంటివి ఉన్నాయి.

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన 7-సీటర్ వాహనాల్లో ఎమ్జి హెక్టర్ ప్లస్ కూడా ఒకటి. కంపెనీ గతంలో విడుదల చేసిన పాపులర్ మిడ్-సైజ్ ఎస్యూవీ ఎమ్జి హెక్టర్ను ఆధారంగా చేసుకొని కంపెనీ ఇందులో 7-సీటర్ మోడల్ను హెక్టర్ ప్లస్ పేరుతో విడుదల చేసింది.

ఈ ఏడాది జనవరిలో ఎమ్జి మోటార్స్ ఇండియా తమ హెక్టర్ ఫేస్లిఫ్ట్తో పాటుగా హెక్టర్ ప్లస్ 7 సీటర్ ఎస్యూవీని కూడా భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో ఎమ్జి హెక్టర్ ప్లస్ 7-సీటర్ ఎస్యూవీ ప్రారంభ ధర రూ.13.34 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంటుంది. కస్టమర్ల అవసరాన్ని బట్టి ఇది 6-సీటర్ మరియు 7-సీటర్ వెర్షన్లలో లభిస్తుంది.

హెక్టర్ ప్లస్ ఎస్యూవీ 1.5 లీటర్ పెట్రోల్ మరియు 2.0 లీటర్ల డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో పెట్రోల్ ఇంజన్ 141 బిహెచ్పి శక్తిని మరియు 250 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అలాగే, డీజిల్ ఇంజన్ 168 బిహెచ్పి శక్తిని మరియు 350 ఎన్ఎమ్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది.


Click it and Unblock the Notifications








