వ్యాపారం కన్నా ప్రజలకు సేవ చేయటమే ముఖ్యం: ఎమ్జి మోటార్ ఇండియా
కోవిడ్-19 మహమ్మారితో పోరాటం చేసేందుకు దేశంలోని ఆటోమొబైల్ కంపెనీలన్నీ తమ వంతు సాయాన్ని చేస్తున్నాయి. చైనాకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ బ్రాండ్ ఎమ్జి మోటార్, దాదాపు గత నెల కాలంగా తమ ప్లాంట్లో వాహనాల ఉత్పత్తిని నిలిపివేసి, వైద్య అవసరాల కోసం ఉపయోగించే ఆక్సిజన్ను తయారు చేస్తోంది.

భారతదేశంలో ప్రస్తుతం తమకు వ్యాపారం కన్నా ప్రజాశ్రేయస్సే ముఖ్యమని కంపెనీ స్పష్టం చేసింది. దేశంలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమైనప్పటి నుండి, ఎమ్జి మోటార్ ఇండియా మే 2021 నెలలో తన వ్యాపారంపై కన్నా సమాజ సేవపైనే ఎక్కువ దృష్టి పెట్టింది.

కోవిడ్-19 సెకండ్ వేవ్ నేపథ్యంలో, ఎమ్జి మోటార్ ఇండియా తమ ప్లాంట్లో వాహనాల ఉత్పత్తిని నిలిపివేసి, వైద్య ఆక్సిజన్ ఉత్పత్తిపై దృష్టి సారించింది. ఇందుకోసం కంపెనీ దేవ్నందన్ గ్యాసెస్ అనే సంస్థతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది. ఇరు సంస్థలు కలిసి ఇప్పటికే వైద్య ఆక్సిజన్ ఉత్పత్తిని 31 శాతానికి పెంచారు.

ఈ రెండు కంపెనీలు కలిసి త్వరలో ఈ ఆక్సిజన్ ఉత్పత్తిని 50 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఏప్రిల్ 21, 2021వ తేదీన ఎమ్జి మోటార్ ఇండియా, తమ ప్లాంట్లో పూర్తిస్థాయి ఆక్సిజన్ గ్యాస్ ఉత్పత్తిపై దృష్టి పెట్టింది. తమ ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకొని, వారికి ఉచితంగా టీకాలు కూడా వేయించింది.

మరోవైపు, కంపెనీ దేశీయ విపణిలో విక్రయిస్తున్న పాపులర్ హెక్టర్ ఎస్యూవీని కంపెనీ అత్యవసర సమయాల్లో ప్రాణాలను కాపాడే అంబులెన్స్గా మార్చింది. ఎమ్జి మోటార్ ఇండియా ఇప్పటికే ఎనిమిది యూనిట్ల రెట్రోఫిటెడ్ హెక్టర్ అంబులెన్స్లను నాగ్పూర్ స్థానిక అధికారులకు అందజేసింది.

మోడ్రన్ లైఫ్ సేవింగ్ సిస్టమ్స్తో ఈ హెక్టర్ అంబులెన్సులను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఎమ్జి మోటార్ సంస్థ ఇలాంటివి 100 యూనిట్లను తయారు చేయనుంది. వీటిలో మెడిసిన్ క్యాబినెట్, వెంటిలేటర్, ఆక్సిజన్ సరఫరా వ్యవస్థ, 5 పారామీటర్ మానిటర్, ఆటో-లోడింగ్ స్ట్రెచర్, అదనపు బ్యాటరీ సాకెట్లతో కూడిన ఇన్వర్టర్, సైరన్, లైట్బార్ మరియు ఫైర్ ఎక్స్టింగ్విషర్ వంటి అవసరమైన వైద్య పరికరాలు ఉన్నాయి.

అంతేకాకుండా, గురుగ్రామ్లోని క్రెడిట్ హెల్త్ ద్వారా ఎమ్జి మోటార్ ఇండియా 200 పడకలను కోవిడ్-19 రోగులకు విరాళంగా ఇచ్చింది. ఈ విధంగా ఎమ్జి మోటార్ ఇండియా, దేశంలో తమ వ్యాపారం కన్నా ఎక్కువగా ప్రజా శ్రేయస్సు కోసమే శ్రమిస్తోంది.

వైద్య వినియోగం కోసం ఆక్సిజన్ను ఉత్పత్తి చేయడానికి ఎమ్జి మోటార్ ఇండియా తమ ప్లాంట్ను షట్డౌన్ చేయటం వలన గడచిన నెలలో ఈ బ్రాండ్ వాహనాలు ఏవీ ఉత్పత్తి కాలేదు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో కొనసాగుతున్న లాక్డౌన్లు కూడా కంపెనీ సప్లయ్ చైన్ను దెబ్బతీశాయి.

ఈ నేపథ్యంలో, తమ వాహనాల కోసం వెయిటింగ్ పీరియడ్ కూడా పెరిగే అవకాశం ఉందని, ఈ విషయంలో కస్టమర్లు తమతో సహకరించాలని కంపెనీ ఓ ప్రకటన కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఎమ్జి మోటార్ ఇండియా దేశీయ విపణిలో హెక్టర్, హెక్టర్ ప్లస్, గ్లోస్టర్ మరియు జెడ్ఎస్ ఈవీ అనే నాలుగు మోడళ్లను విక్రయిస్తున్న సంగతి తెలిసినదే.

ఈ సందర్భంగా ఎమ్జి మోటార్ ఇండియా సేల్స్ డైరెక్టర్ రాకేశ్ సిదానా మాట్లాడుతూ, ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో, ప్రజలను సురక్షితంగా ఉంచడానికి మరియు సమాజానికి సేవలను పెంచే దిశగా తమ ప్రయత్నాలు కొనసాగుతున్నాయని అన్నారు.

జూన్ 2021 నెలలో కూడా కొన్ని రాష్ట్రాల్లో కొనసాగుతున్న లాక్డౌన్ కారణంగా, విడిభాగాల కొరత ఏర్పడుతుందని, ఫలితంగా ఈ నెలలో కూడా మొత్తం వాహనాల ఉత్పత్తి ప్రతికూలంగా ప్రభావితం అవుతుందని ఆయన చెప్పారు. అయితే, వాహనాల బుకింగ్ ధోరణి ఆధారంగా చూస్తే, జూన్ 2021 నెల ఆశాజనకంగా ఉండొచ్చని భావిస్తున్నామని రాకేశ్ అన్నారు.


Click it and Unblock the Notifications








