జాక్పాట్ కొట్టిన టాటా మోటార్స్; 300 ఎలక్ట్రిక్ కార్లకు ప్రభుత్వంతో డీల్!
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఇఇఎస్ఎల్) యొక్క పూర్తి యాజమాన్యంలో ఉన్న కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్ (సిఇఎస్ఎల్) నుండి 300 ఎలక్ట్రిక్ వాహనాల కోసం ఓ ఒప్పందాన్ని దక్కించుకుంది.

ఈ ఒప్పందం ప్రకారం, సిఇఎస్ఎల్ సంస్థకు టాటా మోటార్స్ 300 ఎలక్ట్రిక్ వాహనాల అందజేయనుంది. ఈ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రభుత్వ ప్రయోజనాల కోసం ఉపయోగించనున్నారు. ఈ ప్రయోజనం కోసం టాటా మోటార్స్ తమ నెక్సాన్ ఈవి కార్లను ఉపయోగించనుంది.

సిఇఎస్ఎల్ టాటా నెక్సాన్ ఈవి గురించి ప్రస్తావిస్తూ, టాటా మోటార్స్ అందిస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు (కార్లు) మూడేళ్ల వారంటీతో వస్తాయని మరియు ప్రతి ఛార్జ్పై 250 కి.మీ లేదా అంతకంటే ఎక్కువ రేంజ్ను కలిగి ఉంటుందని పేర్కొంది.

ఈ సందర్భంగా, టాటా మోటార్స్ను ఉద్దేశించి సిఇఎస్ఎల్ ఎమ్డి మహువా ఆచార్య మాట్లాడుతూ, "భవిష్యతు ఎలక్ట్రిక్ వాహనాలదే. భారతదేశంలో ఎక్కువ ప్రభుత్వ సంస్థలు విద్యుత్ రవాణాకు మారడం చాలా సంతోషంగా ఉంది. టాటా మోటార్స్తో మా అనుబంధం భారతదేశంలో భవిష్యత్ చైతన్యాన్ని పెంచుతుంద"ని అన్నారు.

ఈ ఒప్పందం దీర్ఘకాలంలో టాటా మోటార్స్కు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. భారత ఎలక్ట్రిక్ వాహన మార్కెట్లో టాటా నెక్సాన్ ఈవి ఇప్పటికే, ఒక బలమైన మోడల్గా ఉండి, దాని సరసమైన ధర, సుధీర్ఘమైన రేంజ్ మరియు విశిష్టమైన ఫీచర్ల వలన మంచి ప్రజాదరణను సొంతం చేసుకుంది.

ఈ ఒప్పందం గురించి టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్ బిజినెస్ యూనిట్ చైర్మన్ సైలేష్ చంద్ర మాట్లాడుతూ, "ఈ-మొబిలిటీ విషయంలో ప్రభుత్వ అనుకూలమైన విధానానికి మద్దతు ఇవ్వడానికి టాటా మోటార్స్ కట్టుబడి ఉంటుంది. పర్యావరణ అనుకూల పరిష్కారాలను భారీగా స్వీకరించడాన్ని వేగవంతం చేయడానికి వాటాదారుల మధ్య ఆబ్జెక్టివ్ సహకారం ఎంతో ముఖ్యమ"ని అన్నారు.

ఈ టెండర్ మొత్తం ఖర్చు రూ.44 కోట్లు. ఈ టెండర్ రెండు షెడ్యూల్లో వర్తిస్తుంది. ఇందులో మొదటి షెడ్యూల్ ప్రకారం 300 ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేయబడతాయి. ఆ తర్వాత రెండవ షెడ్యూల్లో రవాణా, లోడింగ్, అన్లోడ్, నియమించబడిన ప్రదేశానికి బదిలీ, రవాణా భీమా మరియు వాహనాల పంపిణీకి సంబంధించిన ఇతర ఖర్చులు ఉంటాయి.

టాటా నెక్సాన్ ఈవీ విషయానికి వస్తే, కంపెనీ ఇటీవలే ఈ మోడల్ ధరను రూ.16,000 మేర పెంచింది. దేశీయ మార్కెట్లో టాటా నెక్సాన్ ఈవీ ఎక్స్ఎమ్, ఎక్స్జెడ్ ప్లస్ మరియు ఎక్స్జెడ్ ప్లస్ లగ్జరీ అనే మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో బేస్ వేరియంట్ మినహా మిగిలిన అన్ని వేరియంట్ల ధరలను కంపెనీ పెంచింది.

ప్రస్తుతం మార్కెట్లో టాటా నెక్సాన్ బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ.13.99 లక్షలుగా ఉంది. కాగా, టాటా నెక్సాన్ ఎక్స్జెడ్ ప్లస్ మరియు ఎక్స్జెడ్ ప్లస్ లగ్జరీ వేరియంట్ల ధరలను కంపెనీ రూ.16,000 పెరిగి రూ.15.66 లక్షలకు చేరుకుంది. అలాగే, టాటా నెక్సాన్ ఈవీ ఎక్స్జెడ్ ప్లస్ లగ్జరీ వేరియంట్ ధర కూడా రూ.16,000 పెరిగి రూ.16.56 లక్షలకు చేరుకుంది. (పైన పేర్కొన్న అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా).


Click it and Unblock the Notifications








