భారతీయ మార్కెట్లో విడుదల కానున్న 'ఓలా ఎలక్ట్రిక్ కారు'.. ఇలా ఉంటుంది
2022 ఆగష్టు 15 నాటికి భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతుంది. ఈ సందర్భంగా యావత్ భారతదేశం వజ్రోత్సవ సంబరాలు జరుపుకోవడానికి సన్నద్ధమవుతోంది. ఈ తరుణంలో దేశీయ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ 'ఓలా ఎలక్ట్రిక్' (Ola Electric) మాత్రం ఆగష్టు 15 న ఎలక్ట్రిక్ కారుని విడుదల చేయడానికి సిద్ధమైంది. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో చూద్దాం.. రండి.

ఓలా కంపెనీ విడుదల చేయనున్న కొత్త ఎలక్ట్రిక్ కార్ కంపెనీ యొక్క మొదటి ఎలక్ట్రిక్ కార్ అవుతుంది. దీని గురించి కంపెనీ సీఈఓ భవిష్ అగర్వాల్ ఇప్పటికే కొంత సమాచారం వెల్లడించారు. ఇందులో భాగంగానే టీజర్ ఫోటోలు కూడా వెల్లడయ్యాయి. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ కారును ఆగష్టు 15 న మధ్యాహ్నం 2 గంటలకు ఆవిష్కరించనున్నట్లు ట్వీట్ చేసాడు.

త్వరలో భారతీయ మార్కెట్లో అడుగుపెట్టనున్న ఓలా ఎలక్ట్రిక్ కారు యొక్క ఒక చిన్న వీడియో కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. ఇందులో ఎలక్ట్రిక్ కారు కదులుతున్నట్లు కనిపిస్తుంది. అయితే మొత్తం కారు ఇక్కడ కనిపించదు. త్వరలో ఈ ఎలక్ట్రిక్ కారుకి సంబందించిన మరింత సమాచారం మరియు అధికారిక చిత్రాలు వెలువడతాయి.

ఓలా సీఈఓ ట్వీట్ లో 'ఇంకా చిత్రం చూపవలసి ఉంది మిత్రులారా.. ఆగష్టు 15 మధ్యాహ్నం 02 గంటలకు కలుద్దాం' అని రాశారు. ఇప్పటికే మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ కారు గురించి ఎన్నెన్నో ఊహాగానాలు జరుగుతున్నాయి. అయితే ఇక త్వరలోనే ఈ ఎలక్ట్రిక్ కారు మన ముందుకు వచ్చేస్తుంది. దీని కోసం ఎంతో మంది వాహన ప్రియులు ఎదురు చూస్తున్నారు.

చాలామంది వాహనదారులు రాబోయే ఎలక్ట్రిక్ కారును 'టెస్లా ఆఫ్ ఇండియా' అని కూడా పిలుస్తున్నారు. ప్రస్తుతానికి, ఈ ఎలక్ట్రిక్ కారు యొక్క రేంజ్ మరియు ఫీచర్లకు సంబంధించిన ఎటువంటి సమాచారం ఇంకా అధికారికంగా వెల్లడి కాలేదు.

ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ ఇప్పటికే చాలాసార్లు తమ ఎలక్ట్రిక్ కారుని 2023 నాటికి దేశీయ మార్కెట్లో విడుదల చేస్తామని తెలిపారు. కావున వచ్చే ఏడాదినాటికి ఓలా ఎలక్ట్రిక్ కారు భారతీయ రోడ్లపైన తిరగనుంది. అయితే కంపెనీ దీనిని భారతీయ మార్కెట్ కి అనుకూలంగా ఏవిధంగా తయారు చేస్తుంది అనేది కూడా త్వరలోనే తెలుస్తుంది.

ఇదిలా ఉండగా ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల దేశీయ మార్కెట్లో లిథియం-అయాన్ సెల్ NMC 2170 ని ఆవిష్కరించింది. ఇద్ పూర్తిగా దేశీయ మార్కెట్లో అందుబాటులో ఉన్న ముడి సరుకులు మరియు టెక్నాలజీతో కంపెనీ ఈ బ్యాటరీ సెల్స్ ని తయారు చేసింది. ఓలా ఎలక్ట్రిక్ 2023 నుంచి తన గిగాఫ్యాక్టరీలో ఈ బ్యాటరీ సెల్స్ ను భారీ మొత్తంలో ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపింది.

భారతదేశంలో తయారు చేయబోయే ఈ లిథియం-అయాన్ సెల్ తమ సెల్ టెక్నాలజీ రోడ్మ్యాప్లోని అనేక లక్ష్యాలలో ఒకటి అని భవిష్ అగర్వాల్ తెలిపారు. ప్రపంచ ఈవీ హబ్గా మారడానికి భారతదేశం బలమైన స్థానిక ఈవీ పర్యావరణ వ్యవస్థను కలిగి ఉండటం చాలా ముఖ్యమని ఆయన అభిప్రాయ పడ్డారు.

స్వదేశీ సెల్ టెక్నాలజీలను రూపొందించడానికి, తయారీ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి మరియు ఇంటిగ్రేటెడ్ ఓలా ఎలక్ట్రిక్ వెహికల్ హబ్ను రూపొందించడానికి పరిశోధన మరియు అభివృద్ధిలో పెట్టుబడులు పెట్టడానికి కట్టుబడి ఉన్నామని కంపెనీ తెలిపింది. దీన్ని బట్టి చూస్తుంటే ఓలా ఎలక్ట్రిక్ దేశీయ విఫణిలో నిలదొక్కుకోవడానికి పక్కా ప్రణాళికలను సిద్ధం చేస్తోందని స్పష్టమవుతోంది.

డ్రైవ్స్పార్క్ అభిప్రాయం:
2021 ఆగష్టు 15 న ఓలా ఎలక్ట్రిక్ దేశీయ మార్కెట్లో రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేసింది. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇప్పటి వరకు మంచి అమ్మకాలతో ముందుకు సాగుతున్నాయి. అయితే కంపెనీ ఈ ఆగష్టు 15 న ఎలక్ట్రిక్ కారుని ఆవిష్కరించానికి సన్నద్ధమవుతోంది. ఇది కూడా మార్కెట్లో తప్పకుండా మంచి ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము. అయితే ఈ ఎలక్ట్రిక్ కారు గురించి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ సమాచారం పొందటానికి తెలుగు డ్రైవ్స్పార్క్ ఫాలో అవ్వండి.


Click it and Unblock the Notifications








